Nara Lokesh : అమరావతి రైతుల తరఫున పోరాటం చేసిన వ్యక్తి గల్లా జయదేవ్ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. రాజకీయంగా ఆయనను మిస్ అవుతామన్నారు. రాజకీయాలకు గుంటూరు ఎంపీ జయదేవ్ తాత్కాలికంగా విరామం ప్రకటించిన సందర్భంగా ఏర్పాటు చేసిన కృతజ్ఞతాభివందనం సభలో లోకేశ్ మాట్లాడారు. గల్లా జయదేవ్ కోసం టీడీపీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయన్నారు.
టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏనాడూ కంపెనీల జోలికి వెళ్లలేదని లోకేష్అన్నారు. రైతుల కోసం పోరాటం చేసిన ఎంపీని, ఆయన సంస్థలను అధికార పార్టీ నేతలు ఎలా ఇబ్బంది పెట్టారో చూశామని పేర్కొన్నారు. గుంటూరు టికెట్ ఎవరైనా వదులుకోవడానికి ఎవ్వరూ సిద్దపడరన్నారు. కానీ, జయదేవ్ వదులుకున్నారన్నారు.
గల్లా జయదేవ్ కు పార్టీ మారే అలవాటు లేదని లోకేష్ పేర్కొన్నారు. ఆయన రాజకీయాలకు తాత్కాలికంగానే దూరమవుతున్నారు. కానీ, రాష్ట్ర అభివృద్ధికి ఆయన సహకారం ఎప్పుడూ ఉంటుందని ఆశిస్తున్నానన్నారు. రాజకీయాల్లో అవకాశం ఇచ్చిన చంద్రబాబు, లోకేశ్కు జయదేవ్ ధన్యవాదాలు తెలిపారు.