Places of Worship Act : రామజన్మభూమి ఉద్యమకాలంలో దేశంలో తలెత్తిన ఉద్రిక్తతల వంటివి భవిష్యత్తులో రాకుండా 1991లో నాటి పీవీ నరసింహరావు ప్రభుత్వం ప్రార్థనా స్థలాల చట్టాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. అది రాజ్యాంగ విరుద్ధమనే వాదనలూ వచ్చాయి.
‘1947 ఆగస్టు 15 నాటికి దేశంలో ఉనికిలో ఉన్న ఏ ప్రార్థనా స్థలాన్ని తమదంటూ ఇతర మతాల వారు డిమాండ్ చేయరాదు. దీనిపై ఎలాంటి కొత్త పిటీషన్లను కోర్టులు స్వీకరించరాదు. విచారించరాదు.’ అని చెబుతున్న ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమనే వాదనలూ ఇటీవల సుప్రీంకోర్టు ముందుకొచ్చాయి.
2020 అక్టోబర్లో, బీజేపీ నేత, న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ ఈ చట్టమే చెల్లదంటూ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో ఆయన రెండు అభ్యంతరాలను అంశాలు లేవనెత్తారు. మొదటిది.. రాజ్యాంగం ప్రకారం.. ‘శాంతి భద్రతలు’ అనే అంశం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం. కనుక ఈ అంశంపై కేంద్రం చట్టం చేయటం రాజ్యాంగ విరుద్ధం.
రెండు.. ‘తీర్థయాత్ర’పై చట్టాలు చేసే హక్కు కేంద్రం, రాష్ట్రం రెండిటికీ ఉంది. అయితే, అంతర్జాతీయ పరిధిలోకొచ్చే కైలాస మానసరోవర్ వంటి వాటిపై కేవలం కేంద్రానికి హక్కుంటుంది. రాష్ట్రాల్లో మతపరమైన స్థలాలపై నిర్ణయాలు రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉంటాయి.
ఈ రెండింటికీ తోడు.. ఈ చట్టం చెల్లదంటూ సీనియర్ బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి కూడా విడిగా సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. ఆయన వాదన ఏమిటంటే.. ప్రార్థనా హక్కుల చట్టం-1991 ప్రకారం.. 1947 ఆగస్టు 15కి ముందు ఉనికిలో ఉన్న ప్రార్థనా స్థలాల్లో తమకు అనాదిగా ఉన్న ధార్మిక విశ్వాసాల ఆధారంగా ఎవరూ కోర్టుకెళ్లటం కుదరదు. అయితే.. ఇది మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 32కి వ్యతిరేకమనే పాయింట్ను స్వామి లేవనెత్తారు. ఆర్టికల్ 32 ప్రకారం.. రాజ్యాంగం తనకు కల్పించిన ప్రాథమిక హక్కులు ఉల్లంఘనకు గురైతే.. దేశంలోని ఏ పౌరుడైనా సుప్రీంకోర్టు లేదా హైకోర్టును ఆశ్రయించవచ్చనీ, ఈ ఆర్టికల్ 32 రాజ్యాంగానికి గుండె మరియు ఆత్మ అని అంబేద్కర్ అన్నారనీ, కానీ.. పౌరుల హక్కును పీవీ తెచ్చిన చట్టం నిరోధిస్తుందన్నదే ఆయన అభ్యంతరం.
ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు వేర్వేరుగా విచారణ జరిపింది. వారి ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం జవాబివ్వాలని కోరింది. అయితే, కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు కోర్టుకు సమాధానం చెప్పలేదు. ఇప్పుడు ఈ రెండు కేసులను కలిపి విచారించాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది.