Rohit Sharma : హైదరాబాద్లో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా మారింది. మొదటి రెండు రోజులు టీమ్ ఇండియాదే పై చేయి అయితే, మూడోరోజు ఇంగ్లాండ్ తన వైపునకు తిప్పుకుంది. అయితే ఇంకా పూర్తిగా టీమ్ ఇండియా చేయి జారలేదు. మూడోరోజు మ్యాచ్ లో వికెట్లు పడకపోవడం, బ్రేక్ రాకపోవడంతో కెప్టెన్ రోహిత్ శర్మ కొంచెం అసహనంగా కనిపించాడు. ఫీల్డింగ్ విషయంలో తన మాట వినని సిరాజ్పై కూడా రోహిత్ నోరు పారేసుకున్నాడు.
ఈ నేపథ్యంలో రవీంద్ర జడేజా పదే పదే నో బాల్స్ వేయడం ఇబ్బంది కలిగించింది. ఒకటి రెండు కాదు ఏకంగా 6 నో బాల్స్ వేశాడు.దీంతో రోహిత్ శర్మ దూరం నుంచే తల కొట్టుకున్నాడు. జడ్డూ కొంచెం వెనక నుంచి వేయచ్చు కదా.. అని అరిచాడు.
అప్పటికే జడేజా 26 ఓవర్లు వేసి, ఒక వికెట్ తీసి 101 పరుగులు సమర్పించుకున్నాడు. అయితే అందరికన్నా ఎక్కువ ఓవర్లు జడేజాతోనే వేయించాడు. అప్పటికే బ్యాటింగ్ లో 180 బాల్స్ ఆడి 87 పరుగులు చేసిన జడేజా అలసిపోయినట్టు కనిపించాడు.
ఇక అశ్విన్ 21 ఓవర్లు వేసి 2 వికెట్లు తీసి 93 పరుగులు ఇచ్చాడు.
బుమ్రా 12 ఓవర్లు వేసి 2 వికెట్లు తీసి 29 పరుగులు మాత్రమే ఇచ్చాడు.
అక్షర్ పటేల్ 15 ఓవర్లు వేశాడు. 69 పరుగులిచ్చి 1 వికెట్ తీశాడు.
మరెందుకో మహ్మద్ సిరాజ్ ను అసలు రోహిత్ శర్మ పరిగణలోకే తీసుకోవడం లేదు. మొదటి ఇన్నింగ్స్ లో 4 ఓవర్లు వేయించాడు. అప్పుడంటే 28 పరుగులు ఇవ్వడంతో ఆపేశాడంటే అర్థం ఉంది. కానీ సెకండ్ ఇన్నింగ్స్ లో 3 ఓవర్లలో 8 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అయినా సరే, కంటిన్యూ చేయలేదు.
ఒకవైపు నుంచి బుమ్రాకి వికెట్లు పడుతున్నప్పుడు సిరాజ్ ని కూడా ప్రయత్నించాల్సింది.. స్పిన్నర్లు ఇద్దరికి కాసింత విశ్రాంతి ఇవ్వాల్సిందని సీనియర్లు వ్యాక్యానిస్తున్నారు. నలుగురితోనే నడిపించే బదులు సిరాజ్ ని మధ్యలో దింపి కొత్తగా ట్రై చేయవచ్చు కదా అని సూచిస్తున్నారు. ఒక స్పెషలిస్ట్ బౌలర్ ని తీసుకుని, పక్కన పెట్టడం సరికాదని అంటున్నారు. ఇంగ్లాండ్ కెప్టెన్ అయితే అయిదుగురు బౌలర్లకి సమానంగా అవకాశాలిచ్చాడని చెబుతున్నారు.
సౌతాఫ్రికాలో జరిగిన రెండో టెస్ట్ లో కూడా సిరాజ్ తొలి ఇన్నింగ్స్ లో 6 వికెట్లు తీసి వహ్వా అనిపించాడు. అలాంటి వాడిని రెండో ఇన్నింగ్స్ లో రోహిత్ శర్మ పక్కన పెట్టేశాడు. బుమ్రాతో బౌలింగ్ చేయించాడు. నెట్టింట ఇవన్నీ రకరకాల వివాదాలను మోసుకొస్తున్నాయి. రోహిత్ శర్మని అనుమానించక్కర్లేదు, వెనక నుంచి రాహుల్ ద్రవిడ్ డైరక్షన్ కూడా ఉండి ఉండాలని అంటున్నారు.