Bihar Politics : బిహార్ రాజకీయాలు మూడు రోజులుగా రక్తికట్టిస్తున్నాయి. నిన్నటికి ఈ రక్తికి ఫుల్స్టాప్ పడుతుందని అనుకున్నారు. కానీ, ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇవాళ నితీష్ సీఎం పదవికి రాజీనామా చేసి.. లేఖను గవర్నర్ కు ఇవ్వనున్నారు. ఆ తర్వాత బీజేపీ ఎమ్మెల్యేలతో కలిసి ప్రభుత్వా ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ ను కోరనున్నారు. సాయంత్రం మరోసారి నితీష్ కుమార్ సీఎంగా ప్రమాణం చేస్తారని తెలుస్తోంది.
బీజేపీ సీనియర్ నేత సుశీల్ మోడీతో పాటు బీజేపీలో మరొకరికి డిప్యూటీ సీఎం పదవులు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఇక స్పీకర్ పదవి కూడా బీజేపీకే దక్కేలా రెండు పార్టీల మధ్య ఒప్పందం జరిగినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్కు చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు జేడీయూతో టచ్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఆర్జేడీ ఎమ్మెల్యేలను కూడా తమవైపు తిప్పుకునేందుకు నితీష్ కుమార్ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా.. వీలైనంత ఎక్కువ మధ్య ఎమ్మెల్యేలు ఉండేలా నితీష్ ప్రయత్నాలు చేస్తున్నారు.
మరోవైపు ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ నితీష్ మరోసారి సీఎం అవ్వకుండా ఉండటానికి శతవిదాల ప్రయత్నాలు చేస్తున్నారు. చిన్న పార్టీలతో చర్చలు జరుపుతున్నారు. డిప్యూటీ సీఎం, మంత్రి పదవులు ఆఫర్ చేస్తున్నారు. అయితే, బిహార్ లో ప్రస్తుత పరిస్థితిని చూస్తే లాలూ వ్యూహాలు పనిచేసేలా లేవు. పరిస్థితులు అన్నీ నితీష్ కుమార్కు అనుకూలంగా ఉన్నాయి. అందుకే ప్లాన్ బీ కింద అవిశ్వాస తీర్మానానికి కూడా లాలూ రంగం సిద్దం చేసినట్టు తెలుస్తోంది. వచ్చే నెల 5న బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో నితీష్ కుమార్ పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఇక, నితీష్ కుమార్ తో మాట్లాడటానికి సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే పలుసార్లు ప్రయత్నించారు. ఖర్గే మూడుసార్లు ఫోన్ చేసినా.. నితీష్ కుమార్ మాట్లాడటానికి నిరాకరించినట్టు తెలుస్తోంది. అనుకున్నవన్నీ సవ్యంగా జరిగితే.. ఇవాళ సాయంత్రం బిహార్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతుంది.
బిహార్ అసెంబ్లీలో మొత్తం 243 సీట్లు ఉన్నాయి. JDUకి 45, ప్రస్తుతం బీజేపీకి 78, జితన్ రాం మాంజీ పార్టీ HAM కి నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. మొత్తం 127 మంది అవుతున్నారు. బిహార్ లో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన నెంబర్ 122. కావాల్సిన దాని కంటే ఐదుగురు ఎక్కువగా ఉన్నారు కనుక కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు నితీష్ కు ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు. అందుకే.. జితన్ రాం మాంజీ పార్టీ HAM నేత సంతోష్ మాంజీతో లాలూ మంతనాలు జరుపుతున్నారు.