Gyanvapi Mosque : విజేతల ఖడ్గంతోనే చరిత్ర రాశారంటారు కొందరు. చరిత్ర పునరావృతమవుతుందని చెబుతారు మరికొందరు. చరిత్రను విస్మరిస్తే.. ఆ చరిత్రలోనే కలిసిపోతావని హెచ్చరిస్తారు ఇంకొందరు. మరి.. ఈ చరిత్రే రెండు మతాల మధ్య చిచ్చుపెడుతుంటే.. దానిని ఆపటం ఎలా? రామమందిరం పేరుతో నష్టపోయిన దేశం.. మరోసారి జ్ఞానవాపి పేరు మీద నెత్తురోడాల్సిందేనా? గతం పేరుతో వర్తమానాన్ని నాశనం చేసుకుంటే మన దేశానికి భవిష్యత్తు ఉంటుందా? అసలు జ్ఞానవాపి పేరుమీద ఏం జరుగుతోంది? ఈ కేసు బ్యాక్గ్రౌండ్ ఏంటో చూద్దాం.
Gyanvapi Mosque : విజేతల ఖడ్గంతోనే చరిత్ర రాశారంటారు కొందరు. చరిత్ర పునరావృతమవుతుందని చెబుతారు మరికొందరు. చరిత్రను విస్మరిస్తే.. ఆ చరిత్రలోనే కలిసిపోతావని హెచ్చరిస్తారు ఇంకొందరు. మరి.. ఈ చరిత్రే రెండు మతాల మధ్య చిచ్చుపెడుతుంటే.. దానిని ఆపటం ఎలా? రామమందిరం పేరుతో నష్టపోయిన దేశం.. మరోసారి జ్ఞానవాపి పేరు మీద నెత్తురోడాల్సిందేనా? గతం పేరుతో వర్తమానాన్ని నాశనం చేసుకుంటే మన దేశానికి భవిష్యత్తు ఉంటుందా? అసలు జ్ఞానవాపి పేరుమీద ఏం జరుగుతోంది? ఈ కేసు బ్యాక్గ్రౌండ్ ఏంటో చూద్దాం.
కాశీ ఆలయాన్ని ఆనుకునే జ్ఞానవాపి అనే మసీదు ఉంది. అయోధ్య మాదరిగా ఇక్కడా తమ మందిరాన్ని కూల్చి మసీదు కట్టారనీ, కనుక జ్ఞాన్వాపి మసీదు ప్రాంగణంలో తమను పూజలు చేసుకునేందుకు అనుమతించాలని 1991లో కొందరు అర్చకులు వారణాసి కోర్టుకెక్కారు.
కానీ వారణాసి కోర్టులో జరుగుతున్న విచారణను మూడు దశాబ్దాల తరువాత అలహాబాద్ హైకోర్టు 2021లో నిలిపివేసింది. 17వ శతాబ్దంలో ఆలయాన్ని కూల్చి మసీదు కట్టారన్న ఆరోపణలో నిజమెంతో తేల్చడానికి తలపెట్టిన సర్వేను కూడా సస్పెండ్ చేసింది.
ఇంకోపక్క, ఇలా సర్వే చేయించడం జూలై 11,1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టానికి విరుద్ధమని అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు వాదించింది. ఈ చట్టం ప్రకారం 1947 నాటికి ఆలయాలు ఏ స్థితిలో ఉన్నాయో అదే స్థితిని కొనసాగించాలి. ఇలా వివాదాన్ని త్రిశంకు స్వర్గంలో వదిలివేసిన 2019లోనే అయోధ్య అంతిమ తీర్పు వచ్చింది.
ఆ తీర్పు వచ్చిన మరుసటి నెలలోనే ఐదుగురు సాధారణ గృహిణులు మసీదు గోడమీద కనిపించే శృంగార గౌరిని పూజించుకుంటామంటూ వారణాసి కోర్టును ఆశ్రయించారు. చేసుకున్న విన్నపం మేరకు పునఃప్రారంభ మైంది. 2023 మే 19న మసీదు లోపలి భాగాలను వీడియో సర్వే చేసి, కోర్టుకు సమర్పించారు. దీంతో దీనిపై దేశ వ్యాప్తంగా హిందూ, ముస్లిం ప్రతినిధుల మధ్య మరోసారి వాద ప్రతివాదాలు జరిగాయి. దీంతో ఈ అంశం హెడ్ లైన్స్కి ఎక్కింది.
ఇక్కడొక విషయం గుర్తు చేసుకోవాలి. 1991 నాటి ప్రార్థనాస్థలాల పరి రక్షణ చట్టం చెల్లుబాటును పరిశీలించవలసిందేనని 2021 మార్చిలో నాటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే ధర్మాసనం ప్రకటించింది. సాక్ష్యాలు పరిపూర్ణంగా ఉన్నప్పుడు ఒక కట్టడం మూలరూపాన్ని నిరాకరించడం తగదని చాలామంది న్యాయనిపుణులు అభిప్రాయపడ్డారు కూడా.
కానీ కోర్టు ఆదేశాలను మొదట మసీదు నిర్వహణ సంఘం ఖాతరు చేయకుండా సర్వేబృందాన్ని లోపలికి అనుమతించకుండా, కోర్టును ఆశ్రయించగా వారి వాదనను కోర్టు తోసిపుచ్చింది. మొత్తానికి సర్వే పూర్తయింది. అప్పుడే హిందువుల తరఫున వాదిస్తున్న ఒక న్యాయవాది వజూఖానా(నమాజుకు ముందు కాళ్లుకడుక్కునే కొలను)లో శివలింగం ఉన్నట్టు మీడియాకు వెల్లడించారు. వెంటనే సుప్రీంకోర్టు ముస్లింల ప్రార్థనలకు అడ్డు లేకుండా, శివలింగం ఉన్న ప్రదేశాన్ని సీజ్ చేయవలసిందని ఆదేశాలు ఇచ్చింది.
సీన్ కట్ చేస్తే.. వారం రోజుల నాడు.. భారత పురావస్తు శాఖ చేసిన సర్వే నివేదికను కోర్టు 11 మంది కక్షి దారులకు అందించింది. ఈ నివేదికను బయటికి వెల్లడించకూడదని వారి వద్ద నుంచి కోర్టు అఫిడవిట్లు కూడా తీసుకుంది. కానీ.. ఒక లాయరు ఆ నివేదికలోని విషయాలను యధాతధంగా మీడియాకు వెల్లడించారు. ఈ నివేదిక ప్రకారం.. అక్కడ దొరికిన అనేక శిల్పాలు అక్కడ ముందునుంచే ఆలయం ఉండేదనటానికి రుజువని ఆయన వెల్లడించారు. దీంతో ఈ వ్యవహారం మరో రామజన్మభూమి ఉద్యమానికి దారితీస్తుందా అనే ఆందోళన దేశవ్యాప్తంగా నెలకొంది.
ఇక.. దీనిపై భారత పురావస్తు శాఖ మాజీ డైరెక్టర్ కెకె మహమ్మద్ గతంలోనే దీనిపై స్పందించారు. ‘మనదేశంలో ఎన్నో చిన్న మతాలూ నేటికీ సజీవంగా ఉండగలుగుతున్నాయంటే అందుకు మన లౌకిక భావనలే కారణం. ప్రతి మతానికి దానిదైన పురావస్తు శిల్పం, భవన నిర్మాణం పరిజ్ఞానం ఉన్నాయి. అన్ని సంస్కృతులను గౌరవించి, ఇచ్చిపుచ్చుకోవడాలను ప్రోత్సహించటమే భారత్ సంస్కృతి.
ఇరాన్, ఇరాక్, టర్కీ దేశాల్లో ఎన్నో మినార్లు, గుమ్మటాలున్నా వాటిలో ఒక్కటి కూడా మన కుతుబ్ మినార్కు పోటీరాదు. తాజ్ మహల్కి దగ్గరగా ఉండే ఒక్క నిర్మాణాన్నీ ఇస్లాం దేశాలు చేయలేకపోయాయి. ఎందుకంటే ఇస్లామిక్ నిర్మాణ పటిమకు భారత హస్త కళా నైపుణ్యం తోడైంది కనుక. 21వ శతాబ్దంలో మనదేశం ఒక మిశ్రమ సంస్కృతిలోకి వచ్చింది. మనమంతా మన పొరుగువారి అభిప్రాయాలను గౌరవిస్తూ ముందుకు సాగాల్సిన సమయం వచ్చింది. గొప్ప సమ్మిళిత, సాంస్కృతిక భారతాన్ని నిర్మించాలి’ అని అభిప్రాయ పడ్డారు.
దీనికోసం భారతీయ ముస్లింలు చొరవ తీసుకుని ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. భారత దేశంలో ముస్లిం దురాక్రమణదారులు ధ్వంసం చేసిన 30 వేలకు పైచిలుకు దేవాలయాలకు బదులు అయోధ్య, మధుర, కాశీల్లోని మసీదులపై తమ హక్కులను భారతీయ ముస్లింలు వదులుకోవటం అత్యుత్తమ, హుందాదనంతో కూడిన నిర్ణయం అవుతుందని మహమ్మద్ అభిప్రాయపడ్డారు.
ఇస్లాం జన్మించిన సౌదీ అరేబియా లాంటి దేశాల్లోనే రోడ్ల విస్తరణకు మసీదులను తొలగిస్తున్నప్పుడు.. మనం ఎందుకు సిగ్గుపడాలని ఆయన అన్నారు. నిజంగా మనం సిగ్గుపడాల్సింది మన నిరక్షరాస్యత, పేదరికం గురించి అనీ, దాని నుంచి బయట పడి సమాజంలో గౌరవంగా బతికే అవకాశాలను పొందటమే నేటి భారతీయ ముస్లిం సమాజం ముందున్న అతిపెద్ద సవాలని అన్నారు. దీనిని సరిగా అర్థం చేసుకుని, మొండికి పోకుండా నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు.
అంతిమంగా.. ఇలా గతాన్ని తవ్వుకుంటూ, మాసిన గాయాలను మళ్లీ రేపుకుంటూ శాశ్వతంగా నష్టపోవటం కంటే మధ్యేమార్గంగా ఈ వివాదాన్ని పరిష్కరించుకోవటమే ఉత్తమ పరిష్కారమని మెజారిటీ భారతీయ సమాజం నేడు భావిస్తోంది. పేదరికం, నిరక్షరాస్యత, సామాజిక అసమానతలను అధిగమించాల్సిన ఈ కీలక తరుణంలో ధార్మిక విశ్వాసాల పేరుతో పోట్లాడుకోవటం అంటే.. 5000 ఏళ్ల దేశ చరిత్రను వెనక్కి నడపటమేనని నేటి యువత అభిప్రాయపడుతోంది.