Bhojeshwar Temple : మనదేశంలోని అతిపెద్ద శివలింగం తంజావూరులోని బృహదీశ్వరాలయంలోనిదే అని చాలామంది అనుకుంటుంటారు. కానీ అంతకంటే పెద్ద శివలింగం ఉన్న మరో ఆలయం మనదేశంలో ఉంది. వందల ఏళ్ల క్రితం నిర్మితమై, నేటికీ సైంటిస్టులకు సవాల్ విసురుతున్న అరుదైన విశేషాలున్న విశిష్ట ఆలయమే భోజేశ్వరాలయం. ఇంతకూ ఆ కోవెల ఎక్కడుంది? దాని విశేషాలేమిటో తెలుసుకుందాం. భోజేశ్వరాలయం.. మధ్యప్రదేశ్లోని రైసన్ జిల్లాలో ఉంది. రాజధాని భోపాల్ నుంచి 30 కి.మీల దూరంలో బేత్వా (బేత్రావతి) నదీ తీరంలోని భోజపూర్ గ్రామంలోని ఈ ఆలయానికి వెయ్యేళ్ల చరిత్ర ఉంది. క్రీ.శ 1000 ప్రాంతంలో ఈ ప్రాంతాన్ని పాలించిన పారమార వంశీయుడైన భోజరాజు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది.
ఈ ఆలయంలోని శివలింగం దేశంలోనే అత్యంత ఎత్తైన శివలింగంగా గుర్తింపు పొందింది. 18 అడుగుల ఎత్తు, 7.5 అడుగుల చుట్టుకొలత వున్న ఈ లింగాన్ని ఒకే రాతిలో మలిచారు. ఆ ఆలయాన్ని 106 అడుగుల పొడుగు, 77 అడుగుల వెడల్పు, 17 అడుగుల ఎత్తున్న పీఠం మీద నిర్మించారు. స్థలపురాణం ప్రకారం.. వనవాస సమయంలో ఒకచోటి నుంచి మరొక చోటికి ప్రయాణించే క్రమంలో ఇక్కడి రాగానే.. పాండవుల తల్లి అయిన కుంతీదేవి పరమేశ్వరుడిని ఆరాధించేందుకు ఒక ఆలయాన్ని నిర్మించాలని పాండవులను కోరిందట. దీంతో వారు ముందుగా ఇక్కడి భారీ శివలింగాన్ని ప్రతిష్ఠించి, తర్వాత శివాలయాన్ని పూర్తి చేసే క్రమంలో అక్కడి నుంచి వేరే చోటికి వెళ్లిపోవాల్సి వచ్చిందట. అందుకే ఈ శివాలయానికి శిఖరం ఉండదు.
ఇక్కడి శివలింగాన్ని భారీకాయుడైన భీముడు తన మోకాళ్లపై కూర్చుని ఈ శివలింగాన్ని అర్చించేవాడని చెబుతారు. ఈ ఆలయానికి సమీపంలో బేత్వానదిలోనే వివాహానికి ముందు కుంతీదేవి.. కర్ణుడిని వదిలిపెట్టిందనే కథనం కూడా ప్రాచుర్యంలో ఉంది. ఈ ఆలయాన్ని చేరుకోవాలంటే దానికి ముందున్న 16 మెట్లు ఎక్కాలి. పదహారే కదా.. ఏముంది అనుకుంటే పొరపాటే. ఆ ఒక్కొక్క మెట్టు రెండేసి అడుగులు పొడవు ఉంటాయి. గర్భగుడి 4 బలమైన పెద్ద స్తంబాల ఆధారంగా నిర్మించారు. గర్భాలయపు సింహద్వారం 10 మీటర్ల ఎత్తు, 5 మీటర్ల వెడల్పు వుంటుంది. అక్కడి నుంచి చూస్తే.. గర్భాలయంలోని 7 మీటర్ల ఎత్తున్న ఇసుకరాతి పీఠంమీద అద్భుతమైన శివలింగం దర్శనమిస్తుంది. దీనికి పూజ చేసేందుకు వీలుగా ఇనుప నిచ్చెన వున్నది. ఆలయం ముఖద్వారానికి ఇరు పక్కల గంగ, యమునల విగ్రహాలున్నాయి. లోపల స్ధంబాల మీద ఉమా మహేశ్వరులు, లక్ష్మీ నారాయణులు, బ్రహ్మ సావిత్రిలు (సరస్వతి), సీతారాముల విగ్రహాలు అందంగా మలచబడ్డాయి.
11వ శతాబ్దంలో ఈ ప్రాంతంలో బేత్వా నదీ ప్రవాహాన్ని మళ్ళించటానికి ఇక్కడ 2 మట్టి ఆనకట్టలు కట్టి పెద్ద సరస్సు నిర్మించారు. ఆ తర్వాతి కాలంలో జరిగిన విదేశీ పాలకుల దాడులలో ఒక ఆనకట్ట పూర్తిగా ధ్వంసమయింది. రెండవ దాని శిధిలాలను నేటికీ మనం చూడవచ్చు. ఆలయం వెనక మట్టి, రాళ్ళతో నిర్మింపబడిన ర్యాంపు ఒకటి కనిపిస్తుంది. ఏ టెక్నాలజీ లేని ఆ రోజుల్లో అంత పెద్ద పెద్ద రాళ్ళని పైకి ఎలా ఎత్తగలిగారో నేటికీ అర్థం కాదు. శివాలయానికి ఎదురుగా దాదాపు 2 కి.మీ.ల లోపు పార్వతీ గుహ, భోజరాజు రాజ ప్రాసాదం, మట్టి డాం శిధిలాలని చూడవచ్చు. ఆర్కియాలాజికల్ సర్వే అఫ్ ఇండియా వారి సంరక్షణలో ఉన్న ఈ ఆలయంలో భక్తులే నేరుగా శివలింగానికి పూజలు చేసుకోవచ్చు. మహాశివరాత్రికి ఇక్కడ పెద్ద వేడుక జరుగుతుంది. భోపాల్ నుంచి మండిదీప్ వెళ్ళే బస్లో కొంతదూరం వెళ్లాక.. అక్కడి నుంచి ఆలయానికి నేరుగా ఆటోలు ఉంటాయి.