Mahatma Gandhi : సత్యాహింసలతో భారతావని బానిస సంకెళ్లను తెగదెంచిన బాపూజీ తన జీవితకాలంలో పలు అరుదైన పోరాటాలను నడిపారు. చుక్క రక్తం చిందకుండా, ఒక్క లాఠీ విరగకుండా ఆయన చేసిన పోరాటాలు వలస పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాయంటే నమ్మాల్సిందే. ఆ పోరాటాలు.. వాటి విశేషాలు మీకోసం..
దక్షిణాఫ్రికా సత్యాగ్రహం
లా చదివిన తర్వాత ఉద్యోగం కోసం గాంధీజీ 1893లో దక్షిణాఫ్రికా వెళ్లారు. అక్కడి ట్రాన్స్వాల్ రాష్ట్రంలోని భారతీయులకు ప్రభుత్వపాసు లేకుండా బయట తిరిగే ఛాన్స్ లేకపోవటం, వివాహాలకు గుర్తింపు నిరాకరణ, అధికపన్నులకు వ్యతరేకంగా గాంధీజీ ఏడేళ్ల పాటు శాంతియుతంగా సత్యాగ్రహం నడిపి పన్నులు తగ్గించేలా చేయటంతో బాటు భారతీయుల వివాహాలకు గుర్తింపు, స్వేచ్ఛగా ఎక్కడైనా తిరిగే అవకాశమూ వచ్చేలా చేశారు.
చంపారన్ ఉద్యమం
గాంధీజీ 1915లో భారత్ రాగానే.. బిహార్లోని చంపారన్లో నీలిమందు రైతుల దుస్థితి తెలిసి చలించారు. 1917 ఏప్రిల్లో అక్కడికి వెళ్లి రైతులకు మద్దతుగా సత్యాగ్రహానికి దిగారు. దీంతో బ్రిటిష్ భూస్వాములు వెనక్కి తగ్గారు. దీంతో దేశవ్యాప్తంగా రైతుల్లో గాంధీ హీరో అయ్యారు.
ఖేడా సత్యాగ్రహం
గుజరాత్లోని ఖేడా జిల్లాలో 1918లో వరదలతో పంట నష్టం జరిగినా, ప్రభుత్వం పన్నులు తగ్గించేందుకు నిరాకరించింది. దీంతో శిస్తు కట్టొద్దంటూ బాపూ, పటేల్ పిలుపునిచ్చారు. శిస్తు కట్టకపోతే ఆస్తులు జప్తు చేస్తామని సర్కార బెదరించినా.. జనం బాపూ మాటపై నిలవటంతో ఐదునెలలకు ప్రభుత్వం దిగొచ్చింది. ఆ ఏడాది, మరుసటి ఏడాది శిస్తు మాఫీ చేసి జప్తుచేసిన రైతుల ఆస్తులను తిరిగి అప్పగించింది.
సహాయ నిరాకరణోద్యమం
1919 ఏప్రిల్ 13న జలియన్వాలా బాగ్ దురంతానికి నిరసనగా 1920 సెప్టెంబర్ 4న మహాత్ముడు దీనిని ప్రారంభించారు. ఇందులో భాగంగా విదేశీ వస్తు బహిష్కరణ, ప్రభుత్వ ఉద్యోగాలు, అవార్డుల బహిష్కరణ, కోర్టులు, విద్యాసంస్థల బంద్ జరిగింది. ఇది బ్రహ్మాండంగా సక్సెస్ అవుతున్న వేళ.. నిరసనకారులు, పోలీసుల మధ్య హింస కారణంగా 1922 ఫిబ్రవరి 12న గాంధీజీ ఈ ఉద్యమాన్ని నిలిపివేశారు.
ఉప్పు సత్యాగ్రహం
భారతీయులు ఉప్పు తయారుచేయరాదనే బ్రిటిషర్ల చట్టాన్ని నిరసిస్తూ.. 1930 మార్చి 12 నుంచి ఏప్రిల్ 6 వరకు.. అహ్మదాబాద్ నుంచి దండి వరకు 388 కి.మీ మేర పాదయాత్ర చేసి సముద్రతీరంలో ఉప్పు తయారుచేసి ప్రభుత్వానికి సవాలు విసిరారు. దేశవ్యాప్తంగా లక్షలజనం తీరప్రాంతాల్లో ఉప్పు తయారీకి దిగటంతో 80 వేల మందిని ప్రభుత్వం అరెస్టు చేసింది. దీంతో భారత స్వాతంత్ర్య పోరాటం అంతర్జాతీయంగా చర్చకు వచ్చింది.
క్విట్ ఇండియా ఉద్యమం
తక్షణం బ్రిటిషర్లు దేశాన్ని వదిలిపోవాలంటూ.. 1942 ఆగష్టు 8న గాంధీజీ ‘క్విట్ ఇండియా’ ఉద్యమాన్ని ప్రారంభించారు. చావో రేవో(డూ ఆర్ డై) తేల్చుకోవాల్సిన టైం వచ్చిందని ప్రకటించటంతో దేశమంతా ఒక్కసారిగా రోడ్డెక్కింది. అరెస్టులు,శిక్షలు వేసినా.. జనం తగ్గకపోయే సరికి ఇక భారతీయులకు స్వాతంత్ర్యం ఇవ్వక తప్పదని తెల్లవారికి అర్థమైంది. ఆ తర్వాతే నేతల విడుదల, స్వాతంత్ర్యం ఇచ్చేందుకు చర్చలు మొదలయ్యాయి.