Mahatma : గాంధీజీది ఎడమచేతి వాటం. గాంధీజీ బాల్యంలో ఎవరితోనూ పెద్దగా మాట్లాడేవారు కాదు. ఎవరైనా పలకరిస్తారేమోనని బడి వదలేయగానే పలక తీసుకుని ఎక్కడా ఆగకుండా ఇంటికి పరిగెత్తేవాడు.
గాంధీజీ 13వ ఏటే ఆయన వివాహం జరిగింది. కస్తూర్బా ఆయన కంటే ఒక ఏడాది పెద్దవారు. బాపూజీ 16వ ఏటనే తండ్రి అయ్యారు గానీ.. ఆ శిశువు రోజులకే చనిపోయింది.
గాంధీ ఇంగ్లాండ్లో ‘లా’ విద్యార్థిగా ఉండగా ‘ నీ చేతిరాత కనీసం నీకైనా అర్థమవుతుందా’ అంటూ పలుమార్లు అధ్యాపకుల చీవాట్లు తిన్నారు.
లండన్లో ఉండగా డబ్బు ఆదా చేసేందుకు బస్సులున్నప్పటికీ.. ఐదేసి మైళ్లు నడిచే పోయేవారు.
గాంధీజీకి ఫుట్బాల్ అంటే పిచ్చి. జోహన్స్బర్గ్ , ప్రిటోరియాలో ఆయన రెండు ఫుట్బాల్ క్లబ్లు ఏర్పాటుచేశారు.
1921లో తన మధురై పర్యటనలో చిరుగుల గోచీలు ధరించిన నిరుపేదలను చూశాక.. గాంధీజీ కొల్లాయిని కట్టటం మొదలుపెట్టారు.
ఎడ్విన్ ఆర్నాల్డ్ అనే విదేశీయుడు భగవద్గీత గొప్పదనం గురించి చెప్పేవరకు బాపూజీ దానిని చదవలేదు. నాటినుంచి అది ఆయనకు నిత్యపారాయణ గ్రంథం అయింది.
టైమ్ మ్యాగజైన్ 1930లో ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్’గా బాపూజీ జీవితంపై కవర్ స్టోరీ ఇచ్చింది.
శాకాహారంపై ‘ది మోరల్ బేసిస్ ఆఫ్ వెజిటేరియనిజం’ అనే పుస్తకాన్ని బాపూజీ రచించారు. ఒక దశలో పాలు కూడా వద్దనుకున్నా.. వైద్యుల సలహాతో మేకపాలకు పరిమితమయ్యారు.
గాంధీ నిరాహార దీక్షలో ఉండగా, బ్రిటిషర్లు ఎవరినీ ఫోటోలు తీయనిచ్చేవారు కాదు. అవి బయటికి పోతే.. జనం తిరగబడతారని అధికారులు గడగడలాడేవారు.
భారతదేశంలోనే గాక 48 బయటి దేశాల నగరాల్లోని పలు రోడ్లకు మహాత్ముడి పేరు పెట్టారు.
గాంధీజీ పేరు 1937 నుంచి అయిదుసార్లు నోబెల్ శాంతి పురస్కరానికి షార్ట్ లిస్ట్ అయింది. 1948లోనైనా ఆయనను ఆ గౌరవం వరిస్తుందని అందరూ భావించారు. కానీ.. అంతలోనే ఆయన హత్యకు గురయ్యారు.
మహాత్ముడి అంతిమయాత్రకు ఏకంగా 20 లక్షల జనం స్వచ్ఛందంగా కదిలివచ్చారు. సుమారు 8 కి.మీ. మేర బారులు తీరి ఆయనకు చివరిసారి నివాళులర్పించారు.
తన జీవిత కాలంలో బాపూజీ 50 వేల పేజీలకు పైగానే రచనలు చేశారు.
1959లో తమిళనాడు మధురైలో గాంధీ మ్యూజియాన్ని ఏర్పాటుచేశారు. అందులో హత్యకు గురైన సమయంలో బాపూజీ ధరించిన దుస్తులున్నాయి.
ఆయన జీవితాంతం ఏ బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడారో, ఆయన చనిపోయిన 21 ఏళ్లకు.. అదే ప్రభుత్వం ఆయన పేరున ఒక స్టాంపును విడుదలచేసింది.