India vs England : ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలిటెస్ట్ లో అద్భుతంగా ఆడిన రవీంద్ర జడేజాను మూడోరోజు ఉదయం అవుట్ చేసిన తీరు వివాదాస్పదంగా మారింది. మ్యాచ్ మొదలైన వెంటనే ముందురోజు స్కోరు 81 పరుగులకు కేవలం ఆరు పరుగులు మాత్రమే జోడించి జడేజా అవుట్ అయ్యాడు. జో రూట్ బౌలింగ్ లో జడేజా వికెట్ల ముందు దొరికాడు. ఇంగ్లాండ్ ఎల్బీడబ్ల్యూగా అప్పీలు చేయడంతో అంపైర్ అవుట్ ఇచ్చాడు. దీంతో జడేజా డీఆర్ఎస్ తీసుకున్నాడు.
రివ్యూలో బంతి ప్యాడ్లను, బ్యాట్ ను ఒకే సమయంలో తగిలినట్టు కనిపించింది. అయితే బ్యాటుకు బంతి తగిలినట్లుగా తేలింది. కానీ ప్యాడ్కు తగలకముందే బ్యాటుకు తగిలిందా? బ్యాట్ కి తగిలి ప్యాడ్ కి తగిలిందా? అనే అంశంపై డీఆర్ఎస్ లో స్పష్టత రాలేదు.
దీంతో బాల్ ఈసారి ఫీల్డ్ అంపైర్ కోర్టుకి వెళ్లింది. తను బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చే అవకాశం ఉంది. కానీ ముందే అవుట్ అని చెయ్యెత్తీసేడు. దీంతో అంపైర్ పై తీవ్ర స్థాయిలో నెట్టింట విమర్శలు చెలరేగుతున్నాయి.
స్పష్టత లేని విషయాల్లో ఫీల్డ్ అంపైర్ ను ఎలా సంప్రదిస్తారు? నిజమేమిటో డీఆర్ఎస్ లోనే తేలనప్పడు, తనెలా తీర్పులు చెబుతాడని నెట్టింట జనం మండిపడుతున్నారు.
థర్డ్ అంపైర్ నిర్ణయంతో జడేజాకు తీవ్ర అన్యాయం జరిగిందని అంటున్నారు. అప్పటికి జడేజా 180 బంతులాడి 87 పరుగులు చేశాడు. సరిగ్గా సెంచరీకి 13 పరుగుల ముందు జడేజా అవుట్ అయ్యాడు. ఇందులో 2 సిక్సర్లు, 7 ఫోర్లు ఉన్నాయి. మొత్తానికి నిరాశగా జడ్డూ పెవిలియన్ చేరాడు.
రవీంద్ర జడేజా అవుట్ పై వ్యాఖ్యాతగా ఉన్న రవిశాస్త్రి స్పందించాడు. ఫీల్డ్ అంపైర్ నాటౌట్ అని చెప్పి ఉంటే, డీఆర్ఎస్ లో కూడా నాటౌట్ అని వచ్చేది. కానీ ఇక్కడ అలా జరగలేదని అన్నాడు. ఈ పర్టిక్యులర్ మూమెంట్ లో బెనిఫిట్ ఆఫ్ డౌట్ సూత్రం బ్యాటర్ కి వర్తించదని తెలిపాడు.
డీఆర్ఎస్ లో కోడి ముందా? గుడ్డు ముందా? అనే సందేహాలు వస్తే, అసలెందుకీ టెక్నాలజీ అని నెట్టింట జనం మండిపడుతున్నారు. బాల్ ముందు బ్యాట్ కి తగిలిందా ? ప్యాడ్ కి తగిలిందా? తెలిసే టెక్నాలజీ లేనప్పుడు ఎందుకింత హడావుడి, ఆర్భాటం అని మండిపడుతున్నారు.