JC Prabhakar Reddy : తెలుసుగా జేసీ ప్రభాకర్ రెడ్డి. ఫైర్ బ్రాండ్ లీడర్. ప్రతిపక్షంలో ఉన్నా తాడిపత్రిలో తిరుగులేని నేత. ఎప్పుడూ వివాదాల్లోనే ఉండటం ఆయనకు అలవాటు. వైసీపీ నుంచి ఎప్పటికప్పుడు సవాళ్లు ఎదురవుతుండటంతో.. ఆయన ఈ మధ్య తరుచూ ఫ్రస్టేషన్ కు లోనవుతున్నారు. అధికారులు సహాయ నిరాకరణ చేస్తుండటంతో.. కోపంతో ఊగిపోతున్నారు. మున్సిపల్ ఛైర్మన్ గా ఉన్న ఆయన గతంలో సమావేశం నిర్వహించగా అధికారులు డుమ్మా కొట్టడంతో.. రాత్రంతా ఆఫీసులోనే మకాం వేసి ఆఫీసర్లు దిగొచ్చేలా చేశారు. తాజాగా, మరోసారి జిల్లా ఉన్నతాధికారులపై విరుచుకుపడ్డారు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఇంతకీ ఏం జరిగిందంటే…
‘స్పందన’ కార్యక్రమం వేదికగా జేసీ ఉగ్రరూపం ప్రదర్శించారు. సమస్యలపై కలెక్టర్ స్పందించనప్పుడు ఇక స్పందన ఎందుకుంటూ గట్టిగా నిలదీశారు. ఓ భూసమస్యపై గతంలో ఫిర్యాదు చేసినా ఇంకా ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ కలెక్టర్ నాగలక్ష్మీ, జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్ లపై జేసీ ఫైర్ అయ్యారు. వైసీపీ ఎమ్మెల్యేల ఫిర్యాదులపై వెంటనే స్పందిస్తున్నారు కానీ, తమ విషయంలో ఎందుకు ఉదాసీనంగా ఉంటున్నారంటూ జేసీ నిలదీశారు.
ఇక్కడి వరకూ బాగానే ఉంది. జేసీ వ్యాఖ్యలకు కలెక్టర్ కౌంటర్ ఇవ్వడంతో ఆయన మరింత రెచ్చిపోయారు. ‘సరే ఇక వెళ్లండి’ అంటూ జేసీని ఉద్దేశించి కలెక్టర్ నాగలక్ష్మి అనడంతోు.. ప్రభాకర్ రెడ్డికి చిర్రెత్తుకొచ్చింది. తన చేతిలోని కాగితాలను బల్లపై విసిరేసి.. ఇది పద్దతి కాదంటూ మరోమారు కోపం ప్రదర్శించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి తీరుతో స్పందన కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. ఆ తర్వాత పోలీసులు వచ్చి జేసీకి నచ్చజెప్పి అక్కడి నుంచి తీసుకెళ్లిపోవడంతో పరిస్థితి సద్దుమనిగింది.