ఆమె ఓ వివాహిత. వస్త్ర దుకాణం నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఆమెపై వైసీపీ నేత కన్నుపడింది. వస్త్ర దుకాణం మూసివేసి ఇంటికి వస్తున్న ఆ మహిళపై అఘాయిత్యానికి ప్రయత్నించాడు. ప్రతిఘటించిన బాధితురాలిపై దాడి చేశాడు. జట్టు పట్టుకుని ఈడ్చే ప్రయత్నం చేశాడు. ఈ దారుణ ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది.
బాధితురాలి కథనం ప్రకారం.. బ్రహ్మసముద్రం మండలం గొల్లదొడ్డికి చెందిన మహిళ పాలవెంకటాపురంలో వస్త్ర దుకాణం నడుపుతున్నారు. శుక్రవారం సాయంత్రం షాపు మూసివేసి ఇంటికి వస్తున్నారు. గ్రామ సమీపంలోని చెరువు కట్ట మీదుగా గొల్లదొడ్డికి వచ్చే సమయంలో వైసీపీ నేత, గ్రామ సచివాలయ కన్వీనర్ నటరాజ్ ఆమెను వెంబడించాడు. రేప్ చేసేందుకు ప్రయత్నించాడు. ఈ దుర్మాగుడి బారి నుంచి తప్పించుకునేందుకు ఆమె తీవ్రంగా ప్రయత్నించారు. దీంతో మరింత రెచ్చిపోయిన నటరాజ్ ఆమె జట్టు పట్టుకుని ఈడ్చాడు. కాలితో తన్నాడు.
బాధిత మహిళ ఆర్తనాదాలు విన్న ఓ రైతు వెంటనే అక్కడకు పరుగుతుకుని వచ్చాడు. ఆమెను కాపాడేందుకు ప్రయత్నించాడు. ఆ రైతుపై నటరాజ్ విచక్షణారహితంగా దాడి చేశాడు. కాసేపటి మరికొంత మంది ఘటనా స్థలికి చేరుకున్నారు. దీంతో నటరాజ్ అక్కడి నుంచి పరారయ్యాడు.
స్థానికులు.. బాధితురాలిని కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆమె దాడి జరిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నిందితుడి నటరాజ్ పై అనేక కేసులు ఉన్నాయని గ్రామస్థులు చెబుతున్నారు. అతడు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే, మంత్రి ఉషశ్రీచరణ్ అనుచరుడని తెలిపారు. అందువల్లే నటరాజ్ కు గ్రామ సచివాలయ కన్వీనర్ పదవి కట్టబెట్టారంటున్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీచరణ్ ముఖ్య అనచరుడే మహిళపై అత్యాచార ప్రయత్నం చేశాడంటే ఈ రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఎక్కడ ఉంటుందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.