Sanjay Manjrekar : తొలిటెస్ట్ మ్యాచ్ లో మర్మోగుతున్న ఒకే ఒక్క పేరు ఎవరిదంటే.. రవీంద్ర జడేజా అని చెప్పాలి. తనొక్కడు అడ్డంగా నిలబడిపోవడంతో ఇంగ్లాండ్ నిస్సహాయంగా నిలిచిపోయింది. తనని ఆపి ఉంటే, ఇంగ్లాండ్ మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ను ఆత్మవిశ్వాసంతో ఆరంభించేదని అంటున్నారు.
టీమ్ ఇండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఆట తీరుపై సంజయ్ మంజ్రేకర్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఆట గతినే మార్చేశాడని అన్నాడు. అప్పటివరకు ఇంగ్లాండ్ స్కోరుకి ధీటుగా టీమ్ ఇండియా స్కోరు లేకపోవడంతో ఎక్కడో చిన్న ఆందోళన ఉండేదని, అది రవీంద్ర జడేజా మార్చిపారేశాడని కొనియాడాడు.
మూడోరోజు ఆటను అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా జోడి మరికొంత దూరం తీసుకువెళితే, భారత్ సురక్షిత స్థానానికి చేరుతుంది. అలా 300 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ ముందు నిలబెడితే వారు ఇన్నింగ్స్ తేడాతో ఓటమి పాలవుతారని మంజ్రేకర్ తెలిపాడు.
రవీంద్ర జడేజా కారణంగానే ఇంగ్లాండ్ ఓటమి పాలవనుందని తెలిపాడు. ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ పలు తప్పిదాలు చేశాడని తెలిపాడు. బజ్ బాల్ ఆటతో టీమ్ ఇండియా కూడా దూకుడుగా ఆడటంతో వీరిని ఆపడం ఇంగ్లాండ్ తరం కాలేదని అంటున్నారు. జో రూట్ ని ముందు దింపకపోవడం తప్పిదమే అన్నాడు. అలాగే తుది జట్టు ఎంపిక కూడా కరెక్ట్ గా లేదని అన్నాడు.
ఏదైతేనేం మూడోరోజు ఆట ఇప్పుడు కీలకంగా మారనుంది. రవీంద్ర జడేజా సెంచరీ చేస్తాడా? అక్షర్ పటేల్ తో భాగస్వామ్యం ఎంతవరకు వెళుతుంది. భారత్ అనుకున్న లక్ష్యాన్ని ఇంగ్లాండ్ ముందు ఉంచుతుందా? అనేది తేలాల్సి ఉంది.
యశస్వి జైశ్వాల్ మాట్లాడుతూ సెంచరీ మిస్ కావడంపై చింత లేదని అన్నాడు. దూకుడుగా ఆడే ఉద్దేశంతోనే మొదలెట్టానని తెలిపాడు. జోరూట్ ని నాపై ప్రయోగిస్తారని ముందే ఊహించానని తెలిపాడు. అయితే అన్నివేళలా షాట్ సెలక్షన్స్ కరెక్ట్ గా ఉండవని తెలిపాడు. ఇంకా నేర్చుకోవాల్సి ఉందని, తన ఆటతీరులో లోపాలను సరిచేసుకోవాల్సి ఉందని అన్నాడు.
తొలి టెస్ట్ మ్యాచ్ లో సెంచరీ చేసి ఉంటే బాగుండేది, కానీ రికార్డ్స్ కోసం ఆడటం కన్నా, జట్టు కోసం ఆడాలని అనుకుంటానని తెలిపాడు. అలాగే భారతదేశం తరఫున ఆడటాన్ని గర్వంగా ఫీలవుతానని తెలిపాడు.