ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలిటెస్టు మ్యాచ్ లో టీమ్ ఇండియా ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే మొదటి, రెండో రోజుల్లో మన బ్యాటర్లు యశస్వి, రాహుల్, జడేజా అద్భుతంగా ఆడారు. మిగిలిన వాళ్లు ఫర్వాలేదనిపించారు. అయితే అంతా బాగానే ఉంది కానీ, అంతసేపు క్రీజులో నిలదొక్కుకుని ఇక నుంచి బాగా ఆడే క్రమంలో ఐదుగురు టాప్ ఆర్డర్ బ్యాటర్లు చెత్త షాట్లు కొట్టి వికెట్లు పారేసుకున్నారనే విమర్శలు నెట్టింట వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలో సునీల్ గవాస్కర్, అనిల్ కుంబ్లే లాంటి వాళ్లు, ఇంకా పలువురు క్రికెటర్లు మనవాళ్లు కొట్టిన చెత్త షాట్లను ఉదహరిస్తున్నారు. ఇలా రాబోవు రోజుల్లో ఆడితే ఫలితాలు చేదుగా ఉంటాయని చెబుతున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ (24), శుభ్ మన్ గిల్ (23) ఇద్దరూ కూడా గాల్లోకి లేపారు. ఆ షాట్ సెలక్షన్ కరెక్ట్ గా లేవని దుయ్యబడుతున్నారు.
రోహిత్ శర్మ నిర్లక్ష్యంగానే ఆడాడని, అది అనవసరమని సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. అయితే తను కెరీర్ చివర్లో ఉన్నాడు. శుభ్ మన్ గిల్ కెరీర్ ప్రారంభంలో ఉన్నాడు. టీ 20, వన్డే తరహాలోనే దూకుడుగా టెస్ట్ మ్యాచ్ ల్లో కూడా ఆడాలని అనుకుంటున్నాడని గవాస్కర్ అన్నాడు. 66 బాల్స్ డిఫెన్స్ చేసి క్రీజులో కుదురుకున్నాక, అలాంటి పేలవమైన షాట్ కొట్టడం గిల్ కి కరెక్ట్ కాదని అన్నాడు. సరిగ్గా గిల్ అవుట్ అయ్యే సమయానికి కామెంటరీ బాక్స్ లో గవాస్కర్ కూర్చుని ఉన్నాడు. తను అక్కడికక్కడే సీరియస్ అయ్యాడు.
ఇక కేఎల్ రాహుల్ (86), యశస్వి జైస్వాల్ (80) ఎటాకింగ్ గేమ్ ఆడుతూ స్కోరు పెంచాలనే ఉద్దేశంతో సెంచరీల ముందు అవుట్ అయిపోయారని అంటున్నారు. టెస్ట్ మ్యాచ్ లో ఆ షాట్లు అవసరం లేదని అంటున్నారు. శ్రేయాస్ అయ్యర్ (35) కూడా అలాగే అనవసరపు షాట్ కొట్టి అవుట్ అయ్యాడని విశ్లేషిస్తున్నారు.
మన బ్యాటర్లు బాగానే ఆడుతున్నా, షాట్ల ఎంపిక కరెక్ట్ గా లేదని, టెక్నిక్ సరి చేసుకోవాలని సూచిస్తున్నారు. ఎర్ర బంతి వైట్ బాల్ కంటే గాల్లో ఎక్కువగా కదులుతుంది. బౌన్స్ కూడా ఎక్కువ అవుతుంది. ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని షాట్ ఉండాలి అని టీమ్ ఇండియా బ్యాటర్లకు సునీల్ గవాస్కర్ సూచించాడు.