తెలంగాణలో సంచలనంగా మారిన నకిలీ పాస్ పోర్టు వ్యవహారంపై సీఐడీ దర్యాప్తును వేగవంతం చేసింది. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి.. ఇతర దేశాల వారికి పాస్ పోర్టులు జారీ చేసిన కేసులో సీఐడీ అధికారులు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. అనంతపురానికి చెందిన ఏజెంట్ తో పాటు.. మరొకరిని సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి పాస్ పోర్టులు సహా పలు నకిలీ డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకూ ఈ కేసులో 12 మందిని సీఐడీ అరెస్ట్ చేయగా.. తాజా అరెస్టులతో ఈ సంఖ్య 14కి చేరింది.
ఈ కేసులో కీలక నిందితుడైన అబ్దుస్ సత్తార్ అల్ జవహరి విదేశీయులకు నీలోఫర్ ఆస్పత్రి పేరు మీద ఫేక్ ఆధార్, పాన్కార్డులు, నకిలీ బర్త్ సర్టిఫికేట్లను సృష్టించినట్లు పోలీసులు వెల్లడించారు. ఇప్పటికే నకిలీ పత్రాలతో 92 మంది విదేశీయులు పాస్ పోర్ట్లు తీసుకున్నట్లు సీఐడీ గుర్తించింది. ఆయా దేశాల్లో భారతీయ పౌరులుగా విదేశీయులు చలామణి అవుతున్నారని పేర్కొంది. జగిత్యాల, ఫలక్నుమాలోని చిరునామాలతో ఎక్కువగా పాస్పోర్టులను తీసుకున్నారని దర్యాప్తులో గుర్తించినట్లు తెలిపింది.
ఈ క్రమంలోనే దేశంలోని అన్ని విమానాశ్రయాలను అప్రమత్తం చేయడంలో సీఐడీ నిమగ్నమైంది. ఒకే చిరునామతో ఎక్కువ మంది పాస్ పోర్టు లు పొందారని సీఐడీ వెల్లడించింది. నకిలీ పాస్ పోర్టులతో కొందరు ఇప్పటికే విదేశాలకు వెళ్లగా.. మిగిలిన వారినైనా దేశం దాటకుండా ఉండేందుకు లుక్ అవుట్ నోటీసులు జారీ చేస్తోంది. ఇప్పటి వరకూ అరెస్ట్ అయిన ఏజెంట్ల నుంచి సేకరించిన సమాచారంతో 35కి పైగా పాస్ పోర్టులను రద్దు చేయించేందుకు ప్రాంతీయ పాస్ పోర్టు ఆఫీస్ కు సీఐడీ అధికారులు సమాచారం చేరవేశారు.
మరోవైపు పాస్ పోర్టుల జారీలో కీలక పాత్ర పోషించిన స్పెషల్ బ్రాంచ్ అధికారులపైన శాఖా పరమైన చర్యలు కూడా తీసుకునేందుకు సీఐడీ అధికారులు.. ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. పాస్ పోర్టు జారీకి, ప్రక్రియ పూర్తయ్యేందుకు ఏజెంట్లు అధికారులకు లంచాలను ఇచ్చారని సీఐడీ ఆధారాలు సేకరించింది. విజిటింగ్ వీసాలతో థాయిలాండ్, కెనడా, మలేషియా.. ఇరాక్, దుబాయ్, స్పెయిన్, ఫ్రాన్స్ వెళ్లినట్లు వెల్లడించింది.