Nitish Kumar : జాతీయ రాజకీయాల్లో మరో పెద్ద కుదుపు రానుంది. ఈసారి ఇది పాట్నా కేంద్రంగా జరగనుంది. బిహార్ ప్రస్తుత ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన పదవికి రాజీనామా చేయబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. వీలున్నంత త్వరగా నితీశ్ మహాఘట్బంధన్ నుంచి వైదొలగి, బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం బిహార్లో ప్రభుత్వం నడుపుతున్న మహా ఘట్బంధన్ కూటమిలో కాంగ్రెస్, నితీష్ కుమార్కు చెందిన జేడీయూ, లాలూ ప్రసాద్కు చెందిన ఆర్జేడీ, కాంగ్రెస్ భాగస్వాములుగా ఉన్నాయి. తాజాగా తన పార్టీ (జేడీయూ) ఎమ్మెల్యేలందరినీ బిహార్ సీఎం నితీష్ కుమార్ పాట్నాకు పిలిచారు. ఎమ్మెల్యేలతో కలిసి మాట్లాడాక, నితీష్ తన రాజీనామాను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. బీజేపీ, జితన్ రామ్ మాంఝీకి చెందిన హిందుస్తానీ అవామ్ మోర్చాలతో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు నితీష్ సర్వం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసిన తర్వాత.. అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు నితీశ్ వెళ్తారనే ప్రచారం జాతీయ మీడియాలో జోరుగా జరుగుతోంది.
రెండు రోజుల క్రితమే మోదీ సర్కారు.. బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్కు భారతరత్న పురస్కారం ప్రకటించింది. దీనివల్ల వచ్చే ఎన్నికల్లో బిహార్ బీసీ ఓటర్లను ఆకట్టుకోవచ్చనేది బీజేపీ ఆలోచన. అదేసమయంలో ఇండియా కూటమి కూడా నితీష్కు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదు. దీంతో రాహుల్ పర్యటనకు నితీష్ దూరం పాటించేందుకు నిర్ణయించారు. అటు.. మమతా బెనర్జీ, ఆప్ పార్టీలో ఇండియాతో కలిసి నడిచేందుకు మాటల్లో చెబుతున్నంత ఉత్సాహం చూపటం లేదు. దీంతో సేఫ్ గేమ్ ఆడటమే మేలని నితీష్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
అయితే.. నిజానికి ఈ పరిణామం బిహార్ బీజేపీలోని సీనియర్ నేతలకు ఇష్టంగా లేనప్పటికీ దీనిపై ఢిల్లీలోని బీజేపీ అధిష్ఠానం ఈ మార్పుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. మళ్లీ మరోసారి బీజేపీ తరపున ఉప ముఖ్యమంత్రిగా సుశీల్ కుమార్ మోదీ బాధ్యతలు తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
2024లో నితీష్ మరోసారి రాజీనామా చేస్తే.. 2013 నుంచి ఇప్పటివరకు నితీష్ కుమార్ రాజకీయ కూటములు మారడం ఇది ఐదోసారి అవుతుంది. బిహార్ మాజీ సీఎం దివంగత కర్పూరీ ఠాకూర్కు కేంద్ర సర్కారు భారతరత్న ప్రకటించటం కూడా బీజేపీతో ఆయన అవగాహన కుదర్చుకున్న తర్వాతే జరిగిందనే వార్తలూ వినిపిస్తున్నాయి. ఈనేపథ్యంలో నితీష్ కుమార్ను శాంతింపజేసేందుకు కాంగ్రెస్, ఆర్జేడీ పార్టీలు చివరిసారిగా తమవంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అటు ఆర్జేడీ కూడా తన ఎమ్మెల్యేలను ముందుజాగ్రత్త చర్యలో భాగంగా పాట్నాకు పిలిపించింది. ఏది ఏమైనా పార్లమెంటు ఎన్నికల వేళ.. నితీష్ సరికొత్త రాజకీయ సమీకరణకు దారితీయనుంది.