Twins Re Unite : హేమమాలిని ద్విపాత్రాభినయం చేసిన ‘సీత ఔర్ గీత’ సినిమా 1972లో బాలీవుడ్ బ్లాక్బ్లస్టర్. చిన్నతనంలోనే విడిపోయి.. పెరిగి పెద్దయ్యాక కలిసే కవలల ఇతివృత్తంతో ఆ కథ సాగుతుంది. అది రీల్ స్టోరీ అయితే.. యూరప్ దేశం జార్జియాలో అలాంటి రియల్ స్టోరీ ఒకటి వెలుగుచూసింది. అమీ క్వితియా, అనో సర్టానియా కవలలు. పుట్టిన సమయంలో చెరో దారయ్యారు.
జార్జియాలోనే కిలోమీటర్ల దూరంలో ఒకరికి తెలియకుండా ఒకరు పెరిగారు. అయితే విచిత్రంగా టిక్ టాక్ వీడియో, టాలెంట్ షో ద్వారా దగ్గర కాగలిగారు. శిశువులను అపహరించుకుపోయి.. అమ్ముకునే జాఢ్యం జార్జియాలో మరీ ఎక్కువ. ఆస్పత్రుల నుంచే వారిని ఎత్తుకుపోవడం దశాబ్దాలుగా సాగుతోంది. ప్రభుత్వం సైతం శిశువుల చోరీ రాకెట్ను ఛేదించలేక చతికిలపడింది.
ఆఖరికి ప్రభుత్వ సంరక్షణలో ఉన్న పిల్లలకూ భద్రత కరువైంది. 2018-22 మధ్య నాలుగేళ్లలోనే 1800 మంది పిల్లలు గల్లంతయ్యారు. అదృశ్య కేసుల సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉండొచ్చు. అలా పురిట్లోనే విడదీసి, అమ్మకానికి గురైన పిల్లల జాబితాలో అమీ, అనో కూడా ఉన్నారు. విడిపోయిన 19 ఏళ్లకు వారు తొలిసారిగా కలుసుకోగలిగారు.
‘జార్జియాస్ గాట్ టాలెంట్’ టీవీ షో అంటే అమీ కన్నార్పకుండా చూస్తుంది. ఓ సారి ఆ షోలో డ్యాన్స్ చేస్తున్న అమ్మాయి అచ్చం తనలాగానే ఉండటం చూసి ఆశ్చర్యపోయింది. ఆమె తన సోదరి అని అమీకి ఆ క్షణంలో తెలియదు. అనో విషయంలోనూ ఇదే అనుభవం ఎదురైంది. టిక్టాక్ వీడియోలో అమీని చూసి.. ఇదేమిటి.. ముమ్మూర్తులా తనలాగానే ఉందేమిటని అనుకుంది.
ఆరా తీస్తే కవల సోదరి అని తెలిసింది. అలా వారిద్దరూ ఒకే ప్రాంతంలో ఉన్నప్పటికీ.. రెండేళ్ల క్రితమే కలుసుకున్నారు. అప్పటికి వారిద్దరూ విడిపోయి 19 ఏళ్లు. 2002లో కాన్పు సమయంలో ఆ కవలల తల్లి అజా షోనికి పలు సమస్యలు ఎదురయ్యాయి. అనూహ్యంగా ఆమె కోమాలోకి జారుకుంది. దీంతో ఆమె భర్త గొచా గఖారియా పిల్లలను వేర్వేరు కుటుంబాలకు విక్రయించేశాడు.