Shoaib Malik : వివాదాస్పద క్రికెటర్ షోయబ్ మాలిక్ పై ఫిక్సింగ్ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో తను దుబాయికి పారిపోయాడని అంటున్నారు. ఇప్పుడే మూడో పెళ్లి చేసుకుని ఇంటా, బయటా వివాదాలు మూటగట్టుకున్న షోయబ్ మాలిక్ ఫిక్సింగ్ ఆరోపణలతో అథపాతాళానికి పోయాడని అంటున్నారు.
ఏం జరిగిందంటే.. తను బంగ్లాదేశ్ లో జరిగే లీగ్ మ్యాచ్ ల్లో ఆడుతున్నాడు. అక్కడ బరిషల్ ఫ్రాంచైజీ జట్టుకి మాలిక్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలో సడన్ గా షోయబ్ మాలిక్తో ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ఫ్రాంచైజీ ప్రకటించింది.
కారణం ఏమిటని ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. ఇటీవల ఖుల్నా రైడర్స్ జట్టుతో ఒక మ్యాచ్ జరిగింది. అక్కడ స్పిన్ బౌలింగ్ వేస్తూ ఒకే ఓవర్లో మూడు నోబాల్స్ వేశాడు. నిజానికి స్పిన్ బౌలర్స్ ఎవరూ కూడా నోబాల్స్ ఎక్కువ వేయరు. పడితే పొరపాటున ఒకటి పడుతుంది తప్ప, అన్ని పడవు. ఇది కేవలం మ్యాచ్ ఫిక్సింగ్ వల్లనే ఇలా చేసి ఉంటాడనే అనుమానాలు సామాజిక మాధ్యమాల్లో వ్యక్తమయ్యాయి.
ఇలా నోబాల్స్ వివాదం ముదురుతున్న నేపథ్యంలో షోయబ్ మాలిక్ మెల్లగా అక్కడ నుంచి జారుకున్నాడు. సరాసరి దుబాయ్కు వెళ్లినట్లు తెలుస్తోంది. మరోవైపు ఫార్చ్యాన్ బరిషల్ అతడి కాంట్రాక్ట్ను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.
విషయం తెలిసిన నెటిజన్లు ఏమంటున్నారంటే, షోయబ్ మాలిక్ పాపం పండింది. సానియా మీర్జాను ఏడిపించడం వల్లే ఇలా జరిగిందని తిట్టిపోస్తున్నారు. మరి కొందరు పాపం పండింది. ఆడవాళ్ల జీవితాలతో ఆటలాడే వారికి తగిన శాస్త్రి జరిగిందని అంటున్నారు. ఇవన్నీ నిజమని తేలితే, కొత్తగా పెళ్లి చేసుకున్న సనా జావెద్ కూడా గుడ్ బై చెప్పేస్తుందని కొందరు ఒక అడుగు ముందుకేసి మరీ అంటున్నారు.
ఇంక ఏ దేశంలో, ఏ లీగ్ లో కూడా షోయబ్ మాలిక్ కి ఆడే అవకాశం ఉండదని చెబుతున్నారు. ఇప్పటికి లీగ్ మ్యాచ్ లు ఆడుతూ, రెండు చేతులా సంపాదిస్తూ ఆడింది ఆట, పాడింది పాటగా తిరుగుతున్నాడని, ఇక నుంచి గడ్డు పరిస్థితులు తప్పవని అంటున్నారు.