Flag Unfurling Vs Hoisting : ఏటా జనవరి 26న మనం గణతంత్ర దినోత్సవాన్ని, ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుతుంటాం. ఈ రెండు రోజుల్లో దేశమంతా మనం త్రివర్ణ పతాకాన్ని ఎగరేసి గౌరవ వందనం సమర్పిస్తుంది. అయితే.. ఈ రెండు రోజుల్లో జెండా వందనం జరిగే పద్ధతిలో చాలా తేడా ఉంటుందని చాలామందికి తెలియదు. ఈ విషయంలో మన ఫ్లాగ్ కోడ్ ఏం చెబుతోందో తెలుసుకుందాం.
ఆగస్టు 15న జరిగే జెండా ఆవిష్కరణలో త్రివర్ణ పతాకాన్ని.. జెండాకర్రకు కింద మడతపెట్టి కట్టి.. కింది నుంచి పైకి చేరేలా తాడుతో లాగి ఆవిష్కరిస్తారు. 1947 ఆగస్టు 15న మన ప్రధాని నెహ్రూజీ ఇలాగే పతాకావిష్కరణ చేశారు. స్వాతంత్య్రం సాధించిన ఆ చరిత్రాత్మక ఘటనకు సాక్ష్యంగా జెండాను ఆవిష్కరించారు. నేటికీ ఆ విధానమే కొనసాగుతోంది. రాజ్యాంగంలోనూ దీని గురించి ప్రస్తావించారు. ఇంగ్లీష్లో దీన్నే “Flag Hoisting” అంటారు.
కానీ.. రిపబ్లిక్ డే వేడుకల్లో మాత్రం ముందుగానే జెండాను మడతపెట్టి జెండా కర్రకు కట్టి ఉంచుతారు. తాడును కాస్త లాగితే చాలు.. పతాకావిష్కరణ జరిగిపోతుంది. ఈ ప్రక్రియను రాజ్యాంగంలో “Flag Unfurling”గా పేర్కొన్నారు.
ఇక.. ఆగస్టు 15వ తేదీన ప్రధాని జెండాను ఆవిష్కరిస్తారు. ఆ రోజు రాష్ట్రపతికి ఏ ప్రాధాన్యమూ ఉండదు. ఎందుకంటే.. 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం వచ్చిన రోజు దేశానికి ప్రధాని మాత్రమే ఉన్నారు. ఆయనే నాడు బాధ్యతలు తీసుకున్నారు. అప్పటికి మనకు రాజ్యాంగమే లేదు.
కానీ.. 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చాక, రాష్ట్రపతి పదవి ఏర్పడింది. కనుక గణతంత్ర దినోత్సవంలో రాజ్యాంగానికి అధినేతగా రాష్ట్రపతి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరిస్తారు.