KCR Focus On BRS : మునుగోడు ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ విజయం సాధించడంతో సీఎం కేసీఆర్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇప్పటికే జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తామని చెప్తునే టిఆర్ఎస్ పేరును బిఆర్ఎస్ గా మార్చారు. పార్టీ పేరు మార్పు తర్వాత తొలిసారి జరిగిన ఉప ఎన్నికలో ఘనవిజయం సాధించడంతో కేసీఆర్ బీజేపీని జాతీయ స్థాయిలో ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని నిలువరించేందుకు దాదాపు వంద స్థానాల్లో పోటీ చేయాలని గులాబీ అధినేత సన్నాహాలు చేస్తున్నారు. తెలంగాణలో ఎనిమిది సంవత్సరాలుగా అధికారంలో కొనసాగుతున్న టిఆర్ఎస్ మునుగోడు ఉప ఎన్నికతో ప్రజా వ్యతిరేకతను అధిగమించామని భావిస్తుంది.
తెలంగాణలో టీఆర్ఎస్ సర్కారును కూల్చేందుకు బీజేపీ యత్నిస్తోందని కేసీఆర్ ఆరోపణలు చేశారు. అందులో భాగంగానే నలుగురు ఎమ్మెల్యేలను కొనాలని చూసిందన్నారు. ఈ క్రమంలో బీజేపీ చేస్తున్న చర్యలను దేశ వ్యాప్తంగా ప్రజల్లోకి తీసుకువెళ్తామని కేసీఆర్ అంటున్నారు. ప్రస్తుతం ఎన్నికలు జరగనున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేసేందుకు కేసీఆర్ రెడీ అయ్యారు. దేశ వ్యాప్తంగా బీజేపీ అనుసరిస్తున్న విధానాలతో పాటుగా…ప్రాంతీయ పార్టీలను బీజేపీ ఏ విధంగా అస్థిరపరచాలని చూస్తుందో వివరించాలని కేసీఆర్ భావిస్తున్నారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల ఎన్నికల్లో పోటీపై మాత్రం ఇంకా కేసీఆర్ నిర్ణయం తీసుకోలేదు కానీ బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి మాత్రం సిద్ధమయ్యారు.
మూడవసారి అధికారంలోకి వచ్చి పట్టు నిలుపుకోవాలని భావిస్తున్న కేసీఆర్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల కంటే ముందుగానే తెలంగాణ వ్యాప్తంగా బహిరంగ సభలు నిర్వహించి కార్యకర్తలను ఎన్నికలకు సిద్ధం చేయాలనే ఆలోచనలో ఉన్నారు. అదే విధంగా బీఆర్ఎస్ తరపున దేశ వ్యాప్తంగా దాదాపు 100 లోక్ సభ స్థానాల్లో పోటీ చేసే యోచనలో వున్నారు. బీఆర్ఎస్ ద్వారా ఇప్పటికైతే కేవలం పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారు. ఇతర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై మాత్రం ఇంకా కేసీఆర్ నిర్ణయం తీసుకోలేదు. కానీ మునుగోడు ఉప ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత కేసీఆర్ దూకుడు ఏ విధంగా ఉంటుంది అనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది.