YS Sharmila : దళితులపై కపట ప్రేమ చూపేవారికి తగిన బుద్ధి చెప్పాలని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. అన్ని వర్గాల వారి కోసం అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించారని గుర్తుచేశారు. విగ్రహాలు పెట్టడం వలన పేదల ఆకలి తీరదని.. దళితులపై కపటి ప్రేమ చూపించే వారికి రాబోయే ఎన్నికల్లో బుద్ది చెప్పాలని ఏపీ ఒటర్లకు షర్మిల పిలుపునిచ్చారు. విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని.. జాతీయ పతాకాన్ని ఆమె ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలపై తనదైన శైలిలో స్పందించారు.
రాష్ట్రంలో దళితులపై దాడులు వందశాతం పెరిగిపోయాయని షర్మిల అన్నారు. దారుణంగా చంపి డోర్ డెలివరీ చేసినవారిని పక్కన పెట్టుకుంటున్నారని తెలిపారు. అంబేద్కర్ గురించి గొప్పగా చెప్పడం కాదు.. ఆయన ఆశయాలను అమలు చేయాలని పెర్కొన్నారు. కొందరు నియంతల్లా మారి రాజ్యాంగాన్ని కాలరాస్తున్నారని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ నిధులు దారి మళ్లించి సొంత అవసరాలకు వాడారని తెలిపారు. దళితులపై కపట ప్రేమ చూపేవారికి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రాంతీయ పార్టీలు బడుగు, బలహీనవర్గాలను సమానంగా చూడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వని పార్టీలకు మద్దతు తెలపబోమని ప్రజలు ప్రమాణం చేయాలని షర్మిల అన్నారు.
ఎవరూ కితాబు ఇవ్వకపోతే తన విలువ పడిపోదని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. తాను వైఎస్ఆర్ కుమార్తెను అయినప్పుడు వైఎస్ షర్మిల కాకుండా ఎలా ఉంటానని ప్రశ్నించారు. తన కుమారుడికి వైఎస్ రాజారెడ్డి అని పేరు పెట్టుకున్నానని తెలిపారు. అక్రమంగా సంపాదించుకోవడానికి తన భర్తతో జగన్ వద్దకు వెళ్లానని అభాండాలు వేస్తున్నారని అన్నారు. ఇప్పటి వరకూ తన అన్న వద్దకు ఏమీ ఆశించి వెళ్లలేదని.. దానికి సాక్ష్యం తన అమ్మ విజయమ్మేనని.. మీకు దమ్ముంటే ఆమెను అడగండి అని షర్మిల నిప్పులు చెరిగారు.