Chiranjeevi: నటుడిగా ఎనలేని అభిమాన గణాన్ని సొంతం చేసుకున్న హీరో మెగాస్టార్ చిరంజీవి. సినీ పరిశ్రమకు ఆయన చేసిన కృషిని గుర్తిస్తూ.. కేంద్ర ప్రభుత్వం మరో అత్యున్నత పురస్కారానికి సెలెక్ట్ చేసింది. రిపబ్లిక్ డే సందర్భంగా ‘పద్మ’ పురస్కారాలను కేంద్రప్రభుత్వం వెల్లడించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారిని ఈ అవార్డులకు ఎంపిక చేసింది. ఈ మేరకు ప్రముఖ సినీ నటుడు చిరంజీవిని పద్మ విభూషణ్తో గౌరవించింది. ఈ సందర్భంగా ఆయన ప్రయాణానికి సంబంధించిన కొన్ని విషయాల్ని తెలుసుకుందాం..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో ఓ మధ్య తరగతి కుటుంబంలో పుట్టి పెరిగారు కొణిదెల శివ శంకర వరప్రసాద్. ఆయన తాత శివుడి భక్తుడు కావడంతో ఆయనకు శివశంకర వరప్రసాద్ అని పేరు పెట్టారు. ఆయనకి చదువుకునే వయసులోనే నటనపై ఆసక్తి ఏర్పడింది. ఆ ఆసక్తితో మద్రాసులోని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చదువుతున్నప్పుడే ‘పునాదిరాళ్లు’ చిత్రంతో నటించే తొలి అవకాశాన్ని ఆయన అందుకున్నారు. ఆ ఆనందాన్ని పంచుకునేందుకు సొంతూరు వెళ్లిన వరప్రసాద్.. అప్పుడే తన పేరును చిరంజీవిగా మార్చుకున్నారు.
అయితే అదే సమయంలో మరో సినిమా ‘ప్రాణం ఖరీదు’ కూడా చేశారు. ఈ రెండు సినిమాలలో ముందుగా ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమా మాత్రం ‘ప్రాణం ఖరీదు’. ఆ తర్వాత ‘మనవూరి పాండవులు’, ‘శ్రీరామబంటు’, ‘కోతలరాయుడు’, ‘తాయారమ్మ బంగారయ్యా’, ‘కొత్త అల్లుడు’, ‘పున్నమినాగు’, ‘చట్టానికి కళ్లు లేవు’, ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’, ‘శుభలేఖ’, ‘అభిలాష’, ‘గూఢచారి నెం.1’, ‘మగ మహారాజు’ చిత్రాలతో ఆయన ప్రయాణం ఓ రేంజ్లో ఊపందుకుంది.
అప్పటికే ఇండస్ట్రీలో ఉద్ధండులైన ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్బాబు, కృష్ణంరాజు వంటి కథానాయకులు ఉన్నారు. ఆ పోటీ మధ్యే సినీ రంగంలోకి ప్రవేశించి.. తనకంటూ ప్రత్యేక శైలిని ఏర్పాటు చేసుకుని ప్రయాణం సాగించారు. ఆ తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆయన నటన, డ్యాన్సులు, ఫైట్లకి కొత్త ట్రెండ్ సృష్టించుకుని మాస్ ప్రేక్షకుల్ని అలరించారు. ఎన్నో రికార్డులను తిరగరాశారు. ఆపై రాజకీయ రంగ ప్రవేశంతో 2007 తర్వాత నటనకి దూరమయ్యారు. కానీ, ఆయన అభిమానుల హృదయాల్లోంచి మాత్రం వెల్లలేకపోయారు. బహుశా ఆ అభిమానం వల్లే మళ్లీ ఆయన సినిమాల్లోకి అడుగుపెట్టాల్సి వచ్చిందేమో.
తిరిగి 2017లో ఖైదీ నంబర్ 150 సినిమాతో పునః ప్రవేశం చేశారు. ఈ సినిమాతో ఆయన ఇమేజ్ ఏ మాత్రం చెక్కు చెదరలేదని నిరూపిస్తూ.. ఘన విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత సైరా నరసింహారెడ్డి, గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య చిత్రాలతో విజయాత్ని అందుకున్నారు. ప్రస్తుతం ఆయన తన కెరీర్లో 156వ చిత్రం ‘విశ్వంభర’ చేస్తున్నారు.
పురస్కారాలు..
1987లో ప్రఖ్యాత ఆస్కార్ పురస్కారాల ప్రదానోత్సవానికి ఆహ్వానం అందుకున్నారు. 2006లో భారత ప్రభుత్వం నుంచి పద్మభూషణ్ పురస్కారాన్ని స్వీకరించారు. 2016లో ప్రతిష్ఠాత్మక రఘుపతి వెంకయ్య పురస్కారాన్ని అందుకున్నారు. అలాగే ‘స్వయం కృషి’, ‘ఆపద్బాంధవుడు’, ‘ఇంద్ర’ మూవీలకు గానూ ఉత్తమ నటుడిగా నంది పురస్కారాలు సొంతం చేసుకున్నారు. 2022లో భారత ప్రభుత్వం నుంచి ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ పురస్కారం దక్కించుకున్నారు.
సేవా కార్యక్రమాలు..
మదర్ థెరిస్సా స్ఫూర్తితో 1998లో చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ని ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఆయన రక్తదానం, నేత్రదానం దిశగా అభిమానుల్ని నడిపించారు. అలాగే కరోనా మహమ్మారి సమయంలో చిత్రసీమ స్తంభించిపోవడంతో కార్మికుల్ని ఆదుకోవడం కోసం సీసీసీ సంస్థని ఏర్పాటు చేసి విరాళాల్ని సేకరించి సేవా కార్యక్రమాలు చేపట్టారు.