Gyanvapi Survey Report : వారణాసిలోని ఓ భారీ హిందూ ఆలయాన్ని గతంలో కూల్చి, ఆ శిథిలాలపైనే జ్ఞానవాపి మసీదును నిర్మించారని భారత పురావస్తు విభాగం (ఏఎస్ఐ) సర్వే తేల్చిందంటూ వార్తలు రావటం ఇప్పుడు సంచలనం కలిగిస్తోంది. వారణాసిలో విశ్వనాథ ఆలయం పక్కనే ఉన్న మసీదు కింద అసలైన విశ్వనాథ ఆలయం ఉందని హిందూ కక్షిదారులు జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, కోర్టు అక్కడ సర్వే చేపట్టాలని 2023 జూలై 21న పురావస్తుశాఖను ఆదేశించింది.
దీంతో రంగంలోకి దిగిన ఏఎస్ఐ అక్కడ తవ్వకాలు జరిపి, అందులో తాము గుర్తించిన అంశాల ఆధారంగా 839 పేజీల నివేదికను 2023 డిసెంబరు 18న సమర్పించింది. ఈ సర్వే నివేదిక ప్రతిని తమకు అందజేయాలని హిందూ, ముస్లిం కక్షిదారులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీంతో కోర్టు గురువారం ఆ నివేదకను ఈ కేసులో ఇరువర్గాలకు చెందిన 11 మంది కక్షిదారులకు అందజేసింది.
అయితే ఈ రిపోర్టును ప్రజలకు అందుబాటులో ఉంచాలా? వద్దా? అన్న దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం కాగా, తాజాగా దీనిపై కోర్టు స్పందించింది. ఈ నివేదకను కక్షిదారులెవరూ ప్రజలకు అందుబాటులో ఉంచకూడదని న్యాయస్థానం ఆదేశించింది. పిటిషన్దారులు కూడా తాము ఈ రిపోర్టును బహిరంగపర్చమంటూ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.
అయితే.. ఈ నివేదికలోని ముఖ్యాంశాలను హిందువుల తరఫున కోర్టులో వాదిస్తున్న న్యాయవాది విష్ణు శంకర్ జైన్ గురువారం పురావస్తు శాఖ నివేదికను మీడియా ముందు చదివి వినిపించారు. మసీదు నిర్మాణంలో ఆలయం స్తంభాలను, రాళ్లను వాడారని, గుడి గోడలతోపాటు కొన్ని ఇతర నిర్మాణాలను యథాతథంగా మసీదులో కలిపేశారని ఈ సర్వే నివేదిక వెల్లడించింది. తాము సర్వే చేసే క్రమంలో నాటి ఆలయపు గోడలు, వాటిపై ప్రాచీనమైన 34 శాసనాలను గుర్తించినట్లు ఏఎస్ఐ నివేదిక వెల్లడించిందని తెలిపారు.
దేవనగరి, గ్రంథ, తెలుగు, కన్నడ లిపులలోని ఆ శాసనాలు హిందూ ఆలయానివేననీ, వాటిపై జనార్దన, రుద్ర, ఉమ తదితర హిందూ దేవీదేవతల ప్రస్తావన ఉందని సదురు నివేదిక వెల్లడించిందని హిందూ పక్షపు లాయరు విష్ణుశంకర్ జైన్ తెలిపారు. ఆలయం గోడల మీద చిత్రించిన కమలం గుర్తులను తొలగించి ఆ గోడలను మసీదు నిర్మాణంలో ఉపయోగించిన ఆధారాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు.
మసీదులోని ఒక గదిలో ఓ శాసనం మీద మసీదు నిర్మాణం, విస్తరణకు సంబంధించిన సమాచారాన్ని చెరిపివేయటం కనిపించిందనీ, ఆలయం విధ్వంసానికి ఔరంగజేబు ఇచ్చిన ఆదేశాలకు సంబంధించినదిగా ఈ శాసనాన్ని భావిస్తున్నట్లు సర్వే నివేదికలో ఉందని ఆయన తెలిపారు. అయితే.. ఈ నివేదిక.. ఎలాంటి పరిణామాలకు దారితీస్తోందో అని పలువురు మేథావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.