Emmanuel Macron : ఇండియా రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమాన్యుయేల్ మెక్రాన్ (Emmanuel Macron) శుక్రవారం కీలక ప్రకటన చేశారు. ఎక్కువ మంది భారత విద్యార్థులు ఫ్రాన్స్లో విద్యను అభ్యసించే దిశగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. 2030 నాటికి దాదాపు 30 వేల మంది విద్యార్థులను ఫ్రాన్స్ దేశానికి ఆహ్వానించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ట్విట్టర్ వేదికగా తెలిపారు.
భారత విద్యార్థులకు ఫ్రాన్స్ (France) అన్ని విధాలుగా తోడ్పాటునందించనుందని మెక్రాన్ వివరించారు. ఫ్రెంచ్ మాట్లాడలేని విద్యార్థుల కోసం యూనివర్సిటీల్లో ప్రత్యేకంగా ‘అంతర్జాతీయ తరగతుల’(International Classes)ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. వివిధ సంస్థల భాగస్వామ్యంతో ఒక ప్రత్యేకమైన నెట్వర్క్ను ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. ఫ్రాన్స్లో విద్యను అభ్యసించిన భారత పూర్వ విద్యార్థులకు వీసా సదుపాయం కల్పిస్తామని వెల్లడించారు.