Uma Maheswari : ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ నుంచి పద్మశ్రీ అవార్డును పొందిన ఏకైక వ్యక్తిగా ఉమామహేశ్వరి నిలిచారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పుట్టినా, తండ్రి లాలాజీరావు వేములవాడ రాజరాజేశ్వరిస్వామి దేవస్థానంలో ఆస్థాన నాదస్వర విద్వాంసుడిగా పనిచేయటంలో అక్కడే పెరిగారు. బాల్యం నుంచే ఆమెకు సంగీతంపై ఆసక్తి ఏర్పడటం, సెలవులకు మచిలీపట్నం వచ్చినప్పుడు హరికథలను విని ఆసక్తిని పెంచుకున్నారు. తండ్రి సూచనతో తానూ హరికథా కళాకారిణి కావాలని బలంగా నిర్ణయించుకున్నారు.
అనంతరం 14 ఏళ్ల వయసులో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురంలో ఉన్న శ్రీ సర్వారాయ హరికథా గురుకులంలో చేరి వడ్లమాని నర్సింహదాసు, పెద్దింటి సూర్యనారాయణ దీక్షితులు, కృష్ణమాచార్యులు, లక్ష్మీపతిరావు, విశ్వనాథ భాగవతులు లాంటి ప్రముఖ గురువుల వద్ద శిక్షణ పొందారు. విజయనగరం సంస్కృత కళాశాలలో ‘రుక్మిణి కల్యాణం హరికథా గానం’ తొలి ప్రదర్శనను ఇచ్చారు. అక్కడి నుంచి వెనుదిరిగి చూడలేదు.
ఇప్పటిదాకా వేల ప్రదర్శనలు ఇచ్చారు. దేశంలోని విశ్వవిద్యాలయాలన్నీ ఆమె ప్రదర్శనల్ని ఏర్పాటు చేశాయి. తెలుగుతోపాటు సంస్కృతంలోనూ హరికథా గానం చేశారు. సంగీత నాటక అకాడమీ అవార్డును కూడా అందుకున్నారు. ఉమామహేశ్వరి భర్త కళాకృష్ణ ఆంధ్ర నాట్యంలో నిష్ణాతులు. వీరు అఖిల, సాయిమణిదీప్ అనే ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుని పెంచి పెద్దచేశారు. ప్రస్తుతం హైదరాబాద్ బేగంపేటలో కుటుంబంతో కలిసి ఉమామహేశ్వరి నివసిస్తున్నారు.
అంచెలంచెలుగా ఎదిగి.. జాతీయస్థాయి కళాకారిణిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ కళకు ప్రత్యేక గౌరవాన్ని తీసుకొచ్చి.. దేశవిదేశాల్లో ఎన్నో అవార్డుల్ని అందుకున్నారు. తాజాగా ప్రతిష్ఠాత్మక పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు.