Cash Circulation : దొంగనోట్లను అరికట్టడం, బ్లాక్ మనీని వెలికితీయడం, డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం 500, 1,000 రూపాయల నోట్లు రద్దు చేసి ఆరేళ్లు గడిచిపోయినా… ప్రజల్లో నగదు చలామణి ఏ మాత్రం తగ్గలేదు. పైగా ఓ రేంజ్ లో పెరిగింది.
2016 నవంబర్ 4 నాటితో పోలిస్తే ప్రజల వద్ద ఉన్న నగదు విలువ 71.84 శాతం పెరిగి… రూ.17.7 లక్షల కోట్ల నుంచి రూ.30.88 లక్షల కోట్లకు చేరినట్లు RBI తాజా గణాంకాలు వెల్లడించాయి.
సాధారణ, వ్యాపార లావాదేవీలు… వస్తువులు-సేవల కొనుగోళ్లకు ఉపయోగించే డబ్బును ప్రజల వద్ద ఉన్న నగదుగా లెక్కిస్తారు. వ్యవస్థలో చలామణిలో ఉన్న మొత్తం నగదు నుంచి… బ్యాంకుల దగ్గరున్న డబ్బును తీసేస్తే ఇది వస్తుంది. డిజిటల్ చెల్లింపులు ఎంత ఎక్కువగా పెరుగుతున్నా… నగదు చలామణి కూడా అదే స్థాయిలో పెరుగుతుండటం… ఆర్థిక నిపుణుల్ని ఆశ్చర్య పరుస్తోంది.
ఇటీవల దీపావళి వారంలో నగదు చలామణి ఏకంగా రూ.7,600 కోట్ల మేర తగ్గిందని ఎస్బీఐ నివేదిక వెల్లడించింది. గత రెండు దశాబ్దాల్లో దీపావళి సమయమలో నగదు చెలామణి తగ్గడం ఇదే మొదటిసారని తెలిపింది. జనం ఎక్కువగా డిజిటల్ చెల్లింపులపై ఆధారపడడం పెరగడమే దీనికి కారణమంటున్న ఆర్థికవేత్తలు… ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ నిర్మాణాత్మక మార్పులకు లోనవుతోందని వెల్లడించారు.