Janasena : ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుడ్ న్యూస్ చెప్పింది. పార్టీ గుర్తుగా గాజుగ్లాసుని ఖరారు చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. గత ఎన్నికల్లోనూ జనసేన అదే గుర్తుతో పోటీ చేసినప్పటికీ ఇప్పటికి అధికారికంగా ఖరారు కాలేదు. ఇప్పుడది కన్ఫార్మ్ కావడం వరుసగా ముఖ్య నేతల చేరికలతో జైనసైనికుల్లో కొత్త జోష్ కనిపిస్తోంది. ఆ క్రమంలో సీట్ల సర్దుబాటుపై క్లారిటీ ఎప్పుడొస్తుందా అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
జనసేనలో జోష్ కనిపిస్తోంది. ముఖ్యనేతలు వరుసగా వచ్చి పార్టీలో చేరుతున్న తరుణంలో పార్టీకి గాజుగ్లాస్ సింబల్ను ఈసీ కన్ఫమ్ చేయడంతో వారి ఉత్సాహం రెట్టింపైనట్లు కనిపిస్తోంది. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కల్యాణ్ వరుస కార్యక్రమాలతో బిజీ అయ్యారు. పొత్తుల లెక్కలు, అభ్యర్ధుల ఎంపిక, పార్టీలో చేరడానికి వస్తున్న నేతలతో మంతనాలు, రివ్యూ మీటింగులతో స్పీడ్ పెంచుతున్నారు.
గాజు గ్లాసు ఖరారు చేస్తూ ఉత్తర్వులు జనసేన పార్టీ కార్యాలయం మెయిల్కు అందినట్లు పార్టీ ప్రకటించింది. రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తును కేటాయించాలని ఏపీ ఎన్నికల సంఘానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. గత సార్వత్రిక ఎన్నికలు, ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ జనసేన అభ్యర్థులు గాజు గ్లాసు గుర్తుపైనే పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఏపీ ఎన్నికలతో పాటు ఇకపై జనసేన అభ్యర్థులు గాజు గ్లాసు గుర్తుపైనే బరిలో దిగనున్నారు. జనసేనకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు ఉత్తర్వు కాపీలను పార్టీ లీగల్ సెల్ ఛైర్మన్ సాంబశివ ప్రతాప్ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు అందజేశారు. ఈ సందర్భంగా గాజు గ్లాసు గుర్తు కేటాయించినందుకు కేంద్ర ఎన్నికల సంఘానికి జనసేనాని ధన్యవాదాలు తెలిపారు.
తాజాగా పవన్ కల్యాణ్తో గూడూరు వైసీపీ ఎమ్మెల్యే, తిరుపతి మాజీ ఎంపీ వరప్రసాద్ సమావేశం అయ్యారు. గూడూరు టికెట్ వరప్రసాద్ని కాదని ఈ సారి మేరిగ మురళికి కేటాయించింది వైసీపీ. దీంతో పార్టీపై అసంతృప్తితో ఉన్న వరప్రసాద్ జనసేనానితో టచ్లోకి వచ్చారు. జనసేన పార్టీలో చేరే అంశంపై చర్చించారు. అయితే, ఎన్నికల్లో గూడురు కాకుండా తిరుపతి ఎంపీ స్థానాన్ని వర ప్రసాద్ ఆశిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. ఆయనకు జనసేనాని ఏ స్థానం కేటాయిస్తారు అనేది తెలయాల్సి ఉంది.
మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ మరోసారి పవన్తో భేటీ అయ్యారు. ఇప్పటికే జనసేన పార్టీలో చేరాలని కొణతాల నిర్ణయం తీసుకున్నారు. అనకాపల్లి లోక్ సభ నుంచి జనసేన టికెట్ను ఆశిస్తున్నారాయన. త్వరలోనే అనకాపల్లిలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సిద్ధం అయ్యారు. అయితే, పార్టీ తన సేవలను ఎలా ఉపయోగించుకున్నా. పూర్తిస్థాయిలో పనిచేస్తానని ఏ స్థానం కేటాయిస్తారు అనేది పార్టీ అధినేత ఇష్టమని ప్రకటించారు కొణతాల.
ప్రముఖ సినీ నటుడు పృధ్వీ రాజ్ మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సమక్షంలో పార్టీలో చేరారు. ఆయనకు పార్టీ కండువా వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు పవన్. ప్రముఖ సినీ నృత్య దర్శకుడు షేక్ జానీ మాస్టర్ కూడా జనసేన గూటికి చేరారు. ఎన్నికల్లో చేపట్టాల్సిన ప్రచారంపై నటుడు పృధ్వీ, డ్యాన్స్ మాస్టర్ జానీతో పవన్ చర్చలు జరిపారు.
మరోవైపు వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా పేరున్న మచిలీపట్నం ఎంపీ బాలశౌరి జనసేనపార్టీలో చేరనున్నారు. వైసీపీలో అవమానాలు తట్టుకోలేమంటూ బయటకు వచ్చిన ఆ ఎంపీ త్వరలోనే మంచిరోజు చూసుకుని జనసేనలో చేరతానని అనౌన్స్ చేశారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ను కలిసి చర్చించానని ఆయన మంచి ఆలోచనా విధానం ఉన్న వ్యక్తి అని ప్రశంసించారు.
ఒక వైపు చేరికల పర్వం అలా కొనసాగుతుంటే మరోవైపు పవన్కళ్యాణ్ ఇప్పటికే 35 నియోజకవర్గాలకు సంబంధించిన రివ్యూ మీటింగ్లు పూర్తి చేశారు. జనసేనాని ఉభయ గోదావరి, ఉత్తరాంధ్రలోని సీట్ల ఖరారుపై ఆయన ఫోకస్ పెట్టారు. మొత్తం మీద వరుస కార్యక్రమాలతో పవన్ కల్యాణ్ బిజీగా గడుపుతున్నారు.
.
.