Padma Awards 2024 : తెలుగు ప్రముఖులు మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, ప్రముఖ సినీ నటుడు కొణిదెల చిరంజీవికి దేశం రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్ అవార్డ్ వరించింది. దేశ వ్యాప్తంగా మొత్తం ఐదుగురికి రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ అవార్డులు దక్కాయి. 17 మందికి పద్మభూషణ్, 110 మందికి పద్మశ్రీ అవార్డులను ఇవ్వనున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఎనిమిది మంది పద్మ అవార్డులకు ఎంపిక అయ్యారు.
దేశం అమృతం కాలం దిశగా అభివృద్ధి పథంలో ప్రయాణిస్తున్న తరుణంలో తనకు పద్మ విభూషణ్ పురస్కారం రావడం సంతోషంగా ఉందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ అవార్డ్ తనపై మరింత బాధ్యతలను పెంచిందని తెలిపారు. యువత, రైతులు, మహిళలు సహా నవభారత నిర్మాణంలో భాగస్వాములవుతున్న ప్రతి ఒక్కరికి తనకు వచ్చిన పురస్కారాన్ని అంకితం చేస్తున్నానని ప్రకటించారు.
తనకు పద్మ విభూషణ్ అవార్డ్ రావడంపై సినీ ప్రముఖుడు చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా తనను సొంత మనిషిగా అభిమానులు భావిస్తున్నారన్నారు. అన్నయ్యగా.. బిడ్డగా భావించే కోట్లమంది ఆశీస్సులు, సినీ కుటుంబం అండదండలు.. నీడలా వెన్నంటి నడిచే కోట్లమంది అభిమానులు ప్రేమ, ఆదరణ వల్లే తాను ఈ స్థాయిలో ఉండటానికి కారణమని చిరంజీవి తెలిపారు.
తెలుగురాష్ట్రాల నుంచి ఇద్దరికి పద్మవిభూషణ్ అవార్డులు వరించాయి. తెలంగాణ రాష్ట్రం నుంచి గడ్డం సమ్మయ్య, దాసరి కొండప్ప , వేలు ఆనందాచారి, కేతావత్ సోమ్లాల్, కూరెళ్ల విఠలాచార్యులు పద్మశ్రీ అవార్డులకు ఎంపిక అయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఉమా మహేశ్వరి పద్మశ్రీ అవార్డుకు ఎంపిక అయ్యారు.
.
.