Governor Quota MLCs : గవర్నర్ కోటా ఎమ్మెల్సీలను తమిళిసై సౌందరరాజన్ నియమించారు. ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, మీర్ అమీర్ అలీ ఖాన్ పేర్లకు ఆమోదం తెలిపారు. ఈ ఇద్దరు పేర్లను కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ కు సిఫారసు చేసింది. తొలుత ఈ అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. హైకోర్టులో వివాదం తేలే వరకు రెండు ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయకూడదని నిర్ణయించారు.
ఈ రెండు స్థానాలకు దాసోజు శ్రవణ్, సత్యనారాయణ పేర్లను గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఆ ఇద్దరికీ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ అయ్యేందుకు తగిన అర్హతలు లేవని పేర్కొంటూ తమిళిసై తిరస్కరించారు. తమ అభ్యర్థిత్వాల తిరస్కరణను సవాల్ చేస్తూ దాసోజు శ్రవణ్, సత్యనారాయణ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
మరో వైపు రెండు ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ముందుకెళ్లింది. గవర్నర్ పేర్కొన్న అర్హతలకు అనుగుణంగా ఇద్దరి పేర్లను ప్రతిపాదించింది. అయితే తొలుత ఎమ్మెల్సీ ఖాళీల భర్తీకి ప్రభుత్వ ప్రతిపాదనలపై ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదని నిర్ణయించిన గవర్నర్ తాజాగా ఈ అంశంపై నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్సీలుగా కోదండరాం, మీర్ అమీర్ అలీ ఖాన్ పేర్లకు ఆమోదం తెలిపారు.