YS Sharmila : ఏపీ సీఎం వైఎస్ జగన్ రెడ్డిని నేరుగా టార్గెట్ చేస్తూ ఏపీసీసీ చీఫ్ షర్మిల సంచనల వ్యాఖ్యలు చేశారు. బుధవారం తిరుపతిలో తన అన్న జగన్ చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. వైఎస్ కుటుంబం చీలడానికి జగన్ కారణమని స్పష్టం చేశారు. జగనన్న వల్లే అనేందుకు సాక్ష్యం దేవుడు.. తన తల్లి విజయమ్మ అని పేర్కొన్నారు. కాకినాడలో కాంగ్రెస్ పార్టీ నేతలతో సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఏపీని, తన కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ చీల్చిందని జగన్ వ్యాఖ్యనించిన తర్వాత రోజు షర్మిల కౌంటర్ ఇచ్చి సంచలనం రేపారు.
ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకుంటోందని వైఎస్ షర్మిల అన్నారు. పోలవరం.. వైఎస్ఆర్ కలల ప్రాజెక్టు అని చెప్పారు. వైఎస్ఆర్ సీఎం అయిన 6 నెలల్లోనే ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన విషయాన్ని గుర్తు చేశారు. తన తండ్రి ఆశయాలను జగన్ నెరవేరుస్తారు అని అనుకున్నానని పేర్కొన్నారు. కానీ నెరవేర్చలేదని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టుపై జగన్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం అభివృద్ధి లేకుండా దయనీయ స్థితిలో ఉందంటే దానికి కారణం సీఎం జగనే అని మండిపడ్డారు.
వైసీపీ అధికారంలోకి రావడానికి తానెంతో కృషి చేశానని వైఎస్ షర్మిల చెప్పుకొచ్చారు. 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేశానన్నారు. వైసీపీ ఇబ్బందుల్లో ఉంటే 18 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారని వాళ్లను మంత్రులను చేస్తానని చెప్పి మోసం చేశారని జగన్ పై ఘాటు విమర్శలు చేశారు.
.
.