Police Medals : 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ పోలీస్, ఫైర్ సర్వీస్, హోం గార్డ్, సివిల్ డిఫెన్స్ అధికారులకు.. పోలీసు పతకాలను ప్రకటించింది. దేశంలో మొత్తం 1132 మందికి గ్యాలంట్రీ, సర్వీసు పతకాలను గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అందజేయనుంది. ఈ మేరకు గురువారం జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో.. 275 మందికి పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ, ఇద్దరికి ప్రెసిడెంట్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ, 102 మందికి రాష్ట్రపతి విశిష్ఠ సేవా పతకాలు, 753 మందికి పోలీస్ విశిష్ఠ సేవా (మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్) పతకాలను ప్రకటించింది.
గ్యాలంట్రీ పతకాలను పొందిన 277 మందిలో అత్యధికంగా జమ్మూకశ్మీర్ నుంచి 72 మంది పోలీసులు, ఛత్తీస్ గఢ్ నుంచి 26, ఝార్ఖండ్ నుంచి 23, మహారాష్ట్ర నుంచి 18 మంది ఉన్నారు. సీఆర్పీఎఫ్ నుంచి 65, సశస్త్ర సీమాబల్ నుంచి 21 మంది పోలీస్ పతకాలను అందుకోనున్నారు. అలాగే లెఫ్ట్ వింగ్ తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్న 119 మంది, జమ్మూకశ్మీర్ లో పనిచేస్తున్న 133 మంది కూడా మెడల్స్ అందుకోనున్నారు.
కేంద్ర హోంశాఖ ప్రకటించిన పురస్కారాల్లో తెలంగాణలో 20 మందికి, ఏపీలో 9 మందికి పతకాలు దక్కాయి. ఏపీలో 9 మందికి విశిష్ఠ సేవా పతకాలను ఇవ్వనున్నారు. తెలంగాణ నుంచి ఆరుగురు మెడల్ ఫర్ గ్యాలంట్రీ, ఇద్దరు రాష్ట్రపతి విశిష్ఠ సేవా పతకాలు, 12 మంది పోలీసు విశిష్ఠ సేవా పతకాలను అందుకోనున్నారు. అడిషినల్ డీజీపీలు సౌమ్య మిశ్రా, దేవేంద్ర సింగ్ చౌహాన్ కు రాష్ట్రపతి విశిష్ఠ సేవా పతకాలు దక్కాయి.