YSRCP latest updates(Andhra pradesh political news today):
విజయవాడ సెంట్రల్ వైసీపీ ఇన్ఛార్జ్, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నేడు నియోజకవర్గ కార్యాలయ ప్రారంభం కానుంది.ప్రారంభోత్సవానికి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీ కేశినేని నాని హాజరుకానున్నారు. స్థానిక ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు కూడా వెల్లంపల్లి ఆహ్వానం పంపించారు. అయితే.. ఆయన హాజరుపై క్లారిటీ లేదు. బుధవారం ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించిన మల్లాది విష్ణు తాజా రాజకీయాలపై చర్చించారు.
మల్లాది విష్ణు ఏర్పాటు చేసిన సమావేశానికి ముగ్గురు కార్పొరేటర్లు హాజరుకాగా.. 13 మంది కార్పొరేటర్లు గైర్హాజరు అయ్యారు. మనకు పార్టీనే ముఖ్యమని.. గెలిస్తేనే అందరం బాగుంటామని సమావేశంలో కార్యకర్తలకు మల్లాది విష్ణు.. హితబోధ చేసినట్లు సమాచారం. పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ హాజరుపై మల్లాది.. నోరు మెదపలేదు. అయితే.. ఇవాళ జరిగే నియోజకవర్గ కార్యాలయం ప్రారంభానికి ఆయన హాజరవుతారా లేదా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.
కొంతకాలంగా ఎమ్మెల్యే విష్ణు.. కొత్త ఇన్ఛార్జి వెల్లంపల్లి శ్రీనివాస్ వర్గాల మధ్య అసలు పొసగడం లేదు. విష్ణుకే మధ్య టిక్కెట్టు ఇవ్వాలని ఆయన వర్గం నేతలు.. సత్యనారాయణపురంలో బుధవారం రాత్రి రహదారిపై బైఠాయించారు. వెలంపల్లి కార్యాలయ ప్రారంభోత్సవానికి కచ్చితంగా హాజరు కావాలని విష్ణును వైసీపీ అధిష్ఠానం ఆదేశించినట్టు తెలుస్తోంది. కార్యాలయ ప్రారంభానికి పార్టీ శ్రేణులంతా వెళ్లాలని విష్ణు సూచించినట్టు తెలిసింది. తమకు ఇష్టం ఉన్నా లేకపోయినా.. అధిష్ఠానం చెప్పింది కనుక.. వెళ్లాలనేలా విష్ణు అనడంతో.. ఆయన అనుచరులు ఆగ్రహావేశాలతో ఊగిపోయారు. తాము ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లమని పెద్దఎత్తున నినాదాలు చేస్తూ.. ఆందోళన చేపట్టారు. మధ్య నియోజకవర్గంలో విష్ణు తప్ప మరెవరికీ తాము మద్దతు ఇచ్చేది లేదని.. పెద్దగా నినాదాలు చేస్తూ, రహదారిపై బైఠాయించారు.
వైసీపీలో మల్లాది విష్ణు భవిష్యత్తు ఏంటనేది ప్రస్తుతం అగమ్యగోచరంగా మారింది. అధిష్ఠానం నుంచి ప్రతినిధులు వచ్చి పలుమార్లు విష్ణును బుజ్జగించారు. ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చినట్టు తెలిసింది. అయినా.. విష్ణు అసంతృప్తిలోనే ఉన్నారని సమాచారం. ఇప్పటికే.. వైసీపీ నగర అధ్యక్షుడు బొప్పన భవకుమార్ పార్టీకి దూరమయ్యారు. విష్ణు కూడా వెళ్లిపోతే.. మధ్య నియోజకవర్గంలో అధికార వైసీపీకు గట్టి దెబ్బ తగిలినట్లేనని రాజకీయవర్గాలు చెబుతున్నాయి.