రెరా సెక్రటరీ శివ బాలకృష్ణను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసారు. ఇవాళ తెల్లవారుజామున 3 గంటల నుంచి ఏకకాలం బాలకృష్ణతో పాటు ఆయన బంధువుల ఇళ్లు, ఆఫీసుల్లో ఏసీబీ సోదాలు చేసింది. ఈ సోదాల్లో లెక్కకు మించిన సొమ్ము బయటపడింది. ఆయన ఇంట్లో 85 లక్షల రూపాయల నగదు, 2 కేజీలు బంగారం, ఐదున్నర కేజీలు వెండి, 32 లక్షలు విలువ చేసే వాచ్లు, 3 విల్లాలు, 3 ఫ్లాట్స్, 90 ఏకరాల భూమి గుర్తించామని అధికారులు చెప్పారు.
భూమి ఆయన పేరుతో పాటు బినామీల పేరుపై కూడా ఉన్నట్లు గుర్తించామని అన్నారు. మార్కెట్ వాల్యూ ప్రకారం భూముల విలువ 60 కోట్లు ఉంటుందని.. ఆయన మొత్తం ఆస్తి 75 కోట్ల మార్కెట్ విలువ ఉంటుందని తెలిపారు. నాలుగు చోట్ల సోదాలు కొనసాగుతున్నాయిని అన్నారు. శివ బాలకృష్ణపై కేసు నమోదు చేసి, ఇవాళ న్యాయస్థానం ముందు హాజరుపరుస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు. కొన్ని ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పలేదని.. కస్టడీకి తీసుకొన్ని మరిన్ని విషయాలు రాబట్టాల్సి ఉందని తెలిపారు.
శివ బాలకృష్ణ గతంలో రెండు పోస్టుల్లో కొనసాగాడు. ఆయన హెచ్ఏండీఏ ప్రణాళిక విభాగం డైరెక్టర్గా ఉంటూనే.. మరోవైపు ఎంఏయూడీ ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహించాడు. ఈ క్రమంలో హెచ్ఎండీఏ నుంచి దస్త్రాలను శివ బాలకృష్ణనే పంపించేవారు. ఎంఏయూడీలో డైరెక్టర్ హోదాలో వాటికి తానే జీవోలిచ్చేవారు. రంగారెడ్డి, మేడ్చల్, మెదక్, భువనగిరి, సంగారెడ్డి.. తదితర ఏడు జిల్లాల్లోని భూములకు సంబంధించిన అనుమతుల్లో అక్రమాలకు పాల్పడినట్లు బాలకృష్ణపై ఆరోపణలున్నాయి.
హెచ్ఎండీఏ పరిధి జోన్లలోని నిబంధనల్ని ఆసరాగా చేసుకొని వందల దరఖాస్తులకు ఆమోదముద్ర వేసేందుకు భారీగా వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఒక్కో అంతస్తుకు రూ.4 లక్షల వరకు.. లేఅవుట్లలో ఒక్కో ఎకరాకు రూ.లక్షల్లో వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. నెలకు 70-80 దస్త్రాలకు అనుమతులు మంజూరు చేస్తూ ఆస్తుల్ని పోగేశారని బాలకృష్ణపై అభియోగాలున్నాయి.
హెచ్ఎండీఏలో అన్నీ తానై చూసుకున్న బాలకృష్ణ.. ఓ మాజీ మంత్రితో సత్సంబంధాలు కొనసాగించాడని.. మాజీ మంత్రి అండతోనే భారీగా అక్రమాస్తులు సంపాదించినట్టు బాలకృష్ణపై ఆరోపణలు ఉన్నాయి. హెచ్ఎండీఏ ఆఫీస్ బయట ఉండే బ్రోకర్లనే తన బినామీగా మార్చుకున్నారని తెలుస్తోంది.
.
.