IND vs ENG : హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా టెస్టుల్లో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఈరోజు మొదటి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఉదయం 9 గంటల 30 నిమిషాలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్.. ఐదు రోజుల పాటు జరగనుంది. ప్రేక్షకులను ఉదయం 6 గంటల 30 నిమిషాల నుంచి స్టేడియంలోకి అనుమతించనున్నారు. మ్యాచ్ కోసం ఇరు జట్లు ఇప్పటికే హైదరాబాద్ నగరానికి చేరుకొని ప్రాక్టీస్ కూడా షురూ చేశాయి. సుమారు ఆరేళ్ల తర్వాత ఉప్పల్ స్టేడియంలో టెస్ట్ క్రికెట్ మ్యాచ్ జరగనుండడంతో.. నగరవాసులతో పాటు క్రికెట్ అభిమానులు భారీగా తరలివచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఇరు జట్లు తొలిసారిగా టెస్ట్ మ్యాచ్ ఆడనున్నాయి. ఇప్పటివరకు ఈ మైదానంలో ఇంగ్లండ్ తో టెస్టు ఫార్మాట్ లో భారత్ తలపడలేదు. ఇలాంటి పరిస్థితుల్లో పోటీ ఉత్కంఠగా ఉంటుందని భావిస్తున్నారు. అదే సమయంలో, ఈ మైదానంలో భారత్ ఇప్పటి వరకు 5 టెస్టు మ్యాచ్లు ఆడగా.. అందులో 4 గెలిచి.. ఒకటి డ్రా గా ముగించింది. చివరగా 2018లో వెస్టిండీస్తో భారత్ తలపడింది. ఆ మ్యాచ్ లో భారత్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక ఈ మైదానంలో టీం ఇండియా అత్యధిక స్కోరు 687 పరుగులు కాగా.. అత్యల్ప స్కోరు 367 పరుగులు. ఈ రికార్డులన్నీ పరిశీలిస్తే ఈ గడ్డపై భారత్ను ఓడించడం ఇంగ్లండ్కు అంత సులభం కాదని అభిప్రాయపడుతున్నారు.
పిచ్ స్పిన్కు అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తుండగా.. ఈ మ్యాచ్లో స్పిన్నర్లు కీ రోల్ పోషించనున్నారు. ఇంగ్లాండ్ టెస్టు మ్యాచ్ లకు ఎప్పుడూ.. జట్టులో ఒక్కరే స్పిన్నర్ ఉంటారు. కానీ భారత్లో అయితే మాత్రం ఇద్దరు స్పిన్నర్లతో ఆడుతుంది. ఈసారి ఏకంగా ముగ్గురు స్పిన్నర్లు, ఒకే పేసర్తో ఉప్పల్ టెస్టుకు ప్రత్యర్థి జట్టు సై అంటోంది. మరోవైపు టీమ్ ఇండియా కూడా ముగ్గురు స్పిన్నర్లను బరిలో దింపనుంది. మరి నేడు స్టార్ట్ అయ్యే తొలి టెస్టులో ఆట ఎటు తిరుగుతుందో? హైదరాబాద్ లో టెస్టుల్లో అజేయ రికార్డును కొనసాగిస్తూ రోహిత్ సేన శుభారంభం చేస్తుందా ? అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.
మ్యాచ్ నేపధ్యంలో గ్రౌండ్తో పాటు పరిసర ప్రాంతాల్లో.. పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. స్టేడియం చుట్టూ 360 సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. అలానే మ్యాచ్ కొనసాగే ఐదు రోజుల పాటు ఉప్పల్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపు ఉంటుందని పోలీస్ కమిషనర్ తెలిపారు. కార్లు, బైక్స్, ఇతర వాహనాల పార్కింగ్ కోసం మొత్తం 15 స్థలాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఉప్పల్ పరిసరాల్లో ట్రాఫిక్ను క్రమబద్ధీకరించేందుకు 250 మంది ట్రాఫిక్ సిబ్బందిని నియమించారు. నగరవాసులు అంతా ట్రాఫిక్ ఆంక్షలు గమనించి సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.