National Voters Day : ప్రజాస్వామ్యంలో ఓటు బ్రహ్మాస్త్రం లాంటిది. రానున్న సార్వత్రిక ఎన్నికల వేళ.. కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేసి.. సరికొత్త జాబితాను సిద్ధం చేస్తోంది. జనవరి 25న జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా దేశంలోని ఓటర్లంతా పాత జాబితాలోని తమ పేరును సరిచూసుకోవాలని, అందులో తప్పులుంటే సరిచేయించుకోవాలని ప్రకటించింది. ఈసారి సార్వత్రిక ఎన్నికలతో బాటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కూడా రావటంతో అసెంబ్లీ నియోజక వర్గాల వారీగా జాబితాలను ఈసీ సిద్ధం చేసింది.
జాతీయ ఓటరు సర్వీసుల వెబ్సైట్లోకి వెళ్లి.. మన పేరు, వివరాలు ఇస్తే.. మన ఓటు ఉందో లేదో తెలిసి పోతుంది. అందులో మీ పేరు వివరాలు సరిగా లేకపోతే.. వాటిని సరిచేయించుకోవచ్చు. అలాగే మీ పోలింగ్ కేంద్రం, దాని వివరాలు వగైరాలన్నీ లభిస్తాయి.
ఇక.. 18 ఏళ్లు నిండిన అందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి. ఆన్లైన్లో నమోదు చేసుకోవాలనుకునే వారు ఎన్నికల సంఘం వెబ్సైట్లో ఫారం-6 నింపితే సరిపోతుంది. నేరుగా వెళ్లి దరఖాస్తు చేయాలనుకుంటే.. మీ గ్రామ సచివాలయంలో బూత్లెవల్ ఆఫీసరుకు ఫారం-6 ఇవ్వాలి. ఒకవేళ మీ ఓటును మీకు తెలియకుండానే జాబితా నుంచి తొలగిస్తే.. ఆ సంగతిని ప్రస్తావిస్తూ కలెక్టర్కు దరఖాస్తు చేసుకోవచ్చు. దీనిపై రాత పూర్వకంగానూ సంబంధిత వ్యక్తులపై ఫిర్యాదు కూడా చేయవచ్చు. దీనివల్ల మీ ఓటు తొలగించాలని ఎవరైనా ఫారం-7 ద్వారా ఫిర్యాదు చేశారా అనేది తెలుస్తుంది.
ఓటరు జాబితాలో పేరున్నా, అందులో మీ పేరు, చిరునామా వంటి వాటిలో తప్పులు వస్తే.. ఫారం-8 ద్వారా సరిదిద్దుకోవచ్చు. ఎన్నికల సంఘం వెబ్సైట్ లేదా ఓటరు హెల్ప్లైన్ యాప్లో ఫారం-8 ద్వారా అప్లై చేసుకోవచ్చు. పట్టణాలకు వలస వచ్చిన వారు ఫారం-8 ద్వారా తమ ఓటును బదిలీ చేసుకోవచ్చు.
మొబైల్ సాయంతో మీ ఓటు నమోదు, వివరాలు సరిచేసుకోవటం వంటివి చేసుకోవచ్చు. ఎన్నికల సంఘం రూపొందిన యాప్ను డౌన్లోడ్ చేసుకుని మీ వివరాలిస్తే చాలు..