Tirumala : మనం పూజించే దేవీ దేవతలకు వారంలో నిర్దిష్టమైన రోజున ప్రత్యేక పూజలు, సేవలు చేయటం ఆయా దేవాలయాల్లో మనం చూస్తుంటాం. ఈ క్రమంలోనే తిరుమలలోని శ్రీ వేంకటేశ్వరునికి శనివారం రోజున విశేష సేవలు జరుగుతాయి. అసలు శనివారానికి, తిరుమల శ్రీవారికి ఉన్న అనుబంధం ఏమిటో తెలుసుకుందాం.
ఒక్కో యుగంలో శ్రీ మహావిష్ణువు ఒక్కో అవతారంలో వచ్చి మానవులను కాపాడిన సంగతి మనకు తెలిసిందే. అలాగే.. ఈ కలియుగంలో ఆయన తిరుమల శ్రీ వేంకటేశ్వరుడి రూపంలో తిరుమల క్షేత్రంలో కొలువై మానవాళిని కాపాడుతున్నాడు. ‘కలౌ వేంకట నాయకః’ అనే మాట అందుకే వచ్చింది.
ఇక.. ఆయనకు శనివారానికి ఉన్న సంబంధం సంగతికొస్తే.. తిరుమల ఆలయంలో శ్రీ వేంకటేశ్వరుడు ప్రవేశించిన రోజు శనివారం. అలాగే ఆయన శ్రీనివాసుడిగా వచ్చి, పద్మావతీ అమ్మవారిని వివాహమాడిన రోజు కూడా శనివారమే.
తిరుమల మీద తనకు ఓ ఆలయాన్ని నిర్మించమని శ్రీనివాసుడు.. తొండమాను చక్రవర్తిని ఆదేశించిన రోజు కూడా శనివారమే కాగా.. తిరుమలలో శిలామూర్తిగా నిలిచిన స్వామిని భక్తులు తొలిసారి గుర్తించి పూజించిన రోజు కూడా ఇదే.
కలియుగంలో శ్రీనివాసుడిని భక్తితో ఆరాధించే వారిని తాను పీడించనని శనీశ్వరుడు శనివారం రోజునే వాగ్దానం చేశాడు. దీనికి రుజువుగా.. శనివారం రోజున సుప్రభాత సేవ తర్వాత స్వామివారికి తొలి నైవేద్యంగా పచ్చి ఆవుపాలతో బాటు నల్ల నువ్వులు, బెల్లంతో చేసిన ప్రసాదాన్ని స్వామివారికి నివేదిస్తారు. అలాగే.. స్వామివారి సంకల్పంతో ఆయన చక్రం ‘సుదర్శనం’ ఆవిర్భవించిన రోజు కూడా శనివారమే.
పై కారణాల వల్లనే వెంకన్న భక్తులు శనివారం రోజున స్వామి దర్శనానికి పోటెత్తుతుంటారు