Union Budget : ఏడున్నర దశాబ్దాల కాలంలో దేశ ఆర్థిక ముఖ చిత్రంతో బాటు బడ్జెట్ పెట్టే పద్ధతి కూడా అనేక మార్పులకు లోనైంది. నిజానికి ‘బగెట్’ అనే ఫ్రెంచి పదం నుంచి బడ్జెట్ అనే పదం పుట్టింది. బగెట్ అంటే చిన్న బ్యాగ్ అని అర్థం. మనదేశంలోనూ బడ్జెట్ పత్రాలను ఒక బ్యాగ్లో పెట్టుకుని వచ్చేవారు. బడ్జెట్ను హిందీలో ‘బహీఖాతా’ అంటారు.
కాలక్రమంలో బ్యాగ్ స్థానంలో బ్రీఫ్ కేసు వచ్చింది. ఈ బ్రీఫ్ కేస్ సుమారు 30 ఏళ్లు సాగింది. అయితే.. 2019లో నిర్మలా సీతారామన్ బ్రీఫ్కేసును పక్కనబెట్టి జాతీయ చిహ్నం ఉన్న ఎర్రటి వస్త్రంలో తీసుకొచ్చారు. 2021లో దానినీ మార్చేసి, ఆధునికతకు అద్దం పడుతూ టాబ్లెట్తో బడ్జెట్ సమావేశానికి హాజరయ్యారు. అలా డిజిటల్ ఇండియా దిశగా అడుగులేశారు.
తొలినాళ్లలో మన బడ్జెట్ను కేవలం ఇంగ్లిష్లోనే ప్రచురించేవారు. 1955లో కాంగ్రెస్ ప్రభుత్వం దానిని మార్చేసింది. ఇంగ్లిష్తో పాటు హిందీలోనూ బడ్జెట్ ప్రతులను ప్రింట్ చేయడం ప్రారంభించింది.
బ్రిటిషర్ల కాలం నుంచి బడ్జెట్ను ఫిబ్రవరిలో చివరి వర్కింగ్ డే రోజు.. సాయంత్రం 5 గంటలకు సమర్పిస్తూ వచ్చారు. కానీ.. 1999లో వాజపేయ్ ప్రభుత్వ హయాంలో ఫిబ్రవరి చివరిరోజు ఉదయం 11 గంటలకే బడ్జెట్ను ప్రవేశ పెట్టాలని నిర్ణయించారు. యశ్వంత్సిన్హా ఆర్థికమంత్రిగా ఉన్నప్పుడు ఈ మార్పు జరిగింది.
ఆ తర్వాత బడ్జెట్ పెట్టే తేదీ కూడా మారింది. 2016 వరకు ఫిబ్రవరి చివరి రోజుగా ఉన్న బడ్జెట్ డే.. మోదీ హయాంలో ఫిబ్రవరి 1గా మారింది. 2017లో మోదీ ప్రభుత్వం దానిని ఫిబ్రవరి 1వ తేదీకి మార్చింది. అలా..అరుణ్జైట్లీ తొలిసారి 1 ఫిబ్రవరి 2017న బడ్జెట్ పెట్టారు.
1950 వరకు బడ్జెట్ ముద్రణ.. రాష్ర్టపతి భవన్లో జరిగేది. కానీ అప్పట్లో బడ్జెట్ లీకవటంతో.. ముద్రణను ఢిల్లీలోని మింటో రోడ్లోని ప్రెస్కు మార్చారు. 1980లో నార్త్ బ్లాక్ బేస్మెంట్లోని ప్రభుత్వ ప్రెస్లో బడ్టెట్ కాపీలు ప్రింట్ చేశారు. కానీ.. కొవిడ్ వల్ల 2021లో ముద్రణను నిలిపివేశారు. అలా.. 2021-22 బడ్జెట్ నుంచి కాగితాలు, పుస్తకాల రూపంలో కాకుండా ఎలక్ట్రానిక్ పద్ధతిలో బడ్జెట్ కాపీ పార్లమెంట్ సభ్యులకు అందుతోంది. తొలి కాగిత రహిత బడ్జెట్ అదే. ఆ తర్వాత మొబైల్ యాప్లోనూ బడ్జెట్ పత్రాలను అందుబాటులో ఉంచుతున్నారు.