Doomsday Clock : పారాహుషార్.. ప్రపంచం వినాశనం కావడానికి ఘడియలు మరింత దగ్గర పడ్డాయి. యుగాంతం 90 సెకన్ల దూరంలోనే ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. దీనికి సంకేతంగా డూమ్స్డే(యుగాంతం) గడియారంలో టైమ్ను మార్చారు. మానవాళి మతిలేని చర్యల కారణంగా ప్రపంచ వినాశనానికి ఎంత చేరువలో ఉన్నామన్నదీ హెచ్చరించడానికి డూమ్స్ డే గడియారాన్ని 1947లో ఏర్పాటు చేశారు.
ఇదో సింబాలిక్ క్లాక్. వినాశనానికి మనం ఎంత దూరంలో ఉన్నామనేదానిని ప్రతీకాత్మకంగా సూచిస్తుందీ గడియారం. 90 సెకన్ల దూరంలో యుగాంతం ఉందని ఇప్పుడు శాస్త్రవేత్తలు ఆ క్లాక్ ద్వారా హెచ్చరిస్తున్నారు. 90 సెకన్లు అంటే..అంత సమయంలో వినాశనం జరుగుతుందని కాదు. ప్రపంచ వినాశనానికి అత్యంత చేరువలో ఉన్నామని అర్థం. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న విపత్కర పరిస్థితులను మదింపు చేస్తూ డూమ్స్ డే క్లాక్లో సమయాన్ని ఏటా సవరిస్తూ ఉంటారు.
అర్థరాత్రి 12 గంటల సమయం యుగాంతానికి సూచికగా తీసుకుంటారు. ముల్లును ముందుకు, వెనక్కి జరుపుతూ భూగోళం అంతమయ్యే సమయాన్ని చెబుతారు. రష్యా-ఉక్రెయిన్ యుద్దం, అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ మెరుపుదాడి దరిమిలా మూడో ప్రపంచ యుద్ధ భయం మరింత పెరిగింది. అదే సమయంలో కార్చిచ్చులు, వరదలు, ఇతర ప్రకృతి వైపరీత్యాల వల్ల పర్యావరణపరంగా మనమెంత చిక్కుల్లో పడ్డామో అర్థమవుతోంది.
ఈ నేపథ్యంలో భూగోళం మున్నెన్నడూ లేని రీతిలో ఉపద్రవంలో చిక్కుకుందని సూచిస్తూ డూమ్స్డే క్లాక్ను తాజాగా సెట్ చేశారు. మన్హట్టన్ ప్రాజెక్టులో తొలి అణ్వాయుధాలను అభివృద్ధి చేసిన యూనివర్సిటీ ఆఫ్ షికాగో శాస్త్రవేత్తల బృందం 1945లో ‘ది బులెటిన్ ఆఫ్ ది అటామిక్ సైంటిస్ట్స్’ అనే సంస్థను ఏర్పాటు చేసింది. 1947 నుంచి డూమ్స్ డే క్లాక్ను ఆ సంస్థే నిర్వహిస్తోంది.
ఆ సంస్థకు చెందిన సైన్స్ అండ్ సెక్యూరిటీ బోర్డు(SASB) తాజాగా గడియారం సమయాన్ని మార్చింది. బోర్డులోని 22 మంది సభ్యులు యుగాంతం సమయంపై నిర్ణయం తీసుకుంటారు. వీరిలో 11 మంది నోబెల్ పురస్కార గ్రహీతలే. 12 గంటలకు 90 సెకన్ల దూరంలో.. అంటే వినాశనానికి అత్యంత చేరువలో ఉన్నామని ఆ బోర్డు తాజాగా హెచ్చరించింది.
అణుదాడులు, ప్రకృతి వైపరీత్యాలతో పాటు కృత్రిమ మేధ(ఏఐ) తరహా విధ్వంసక సాంకేతికత, కరోనా వంటి మహమ్మారులకు కారణమయ్యే పరిశోధనలు మానవాళికి సవాల్ విసురుతున్నాయి. డూమ్స్డే క్లాక్లో వీటన్నింటినీ చేర్చారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆరంభమైన కొన్నాళ్లకే వినాశన సమయం 90 సెకన్లుగానే ఉంది. 2023 కన్నా మూడేళ్ల ముందు ఒకసారి సమయాన్ని మార్చారు. 2020లో 100 సెకన్లు సెట్ చేశారు. ప్రచ్ఛన్న యుద్ధం ముగిసన తర్వాత 1991లో యుగాంత సమయం 17 నిమిషాలుగా ఖరారు చేశారు.