Surya Kumar Yadav : టీమ్ ఇండియాలో ఉన్నది 11 మంది ఆటగాళ్లు మాత్రమే కాదు. వారిని విడిగా చూస్తే ఒకొక్కరు ఒకొక్క గిరి శిఖరంగా ఉన్నారు. వ్యక్తిగతంగా ఎవరికి వాళ్లు ఒకరిని మించి ఒకరు శిఖరాలు అధిరోహిస్తున్నారు.అందులో టీ 20 క్రికెట్ లో సూర్యకుమార్ యాదవ్(Surya Kumar Yadav) రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాడు. ఐసీసీ ప్రతిష్టాత్మకంగా అందించే మెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్, 2023 సంవత్సరానికి గాను సూర్యకుమార్ ఎంపికయ్యాడు.
టీ 20 ఫార్మాట్లో ఐసీసీ ఉత్తమ క్రికెటర్ అవార్డును వరుసగా రెండోసారి అందుకున్నాడు. ఇలా టీ20 ఫార్మాట్లో ఈ అవార్డును రెండు సార్లు అందుకున్న ఏకైక క్రికెటర్గా సూర్యకుమార్ నిలిచాడు.
2023లో సూర్యకుమార్ 17 ఇన్నింగ్స్లో 48 సగటుతో 733 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు ఉన్నాయి. అనూహ్యంగా తాత్కాలిక కెప్టెన్ కూడా అయిన సూర్య సమర్థుడైన కెప్టెన్ గా పేరుతెచ్చుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన 5 టీ 20 మ్యాచ్ ల సిరీస్ ను 4-1 తేడాతో గెలిపించాడు. అలాగే సౌతాఫ్రికాతో జరిగిన సిరీస్ ను 1-1తో సమం చేశాడు.
ఐసీసీ ఈ అవార్డును 2021 నుంచి ఇస్తోంది. తొలిసారి అవార్డుని పాకిస్థాన్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ అందుకున్నాడు. 2022 లో కూడా సూర్యకుమార్(SKY)నే అవార్డు వరించింది. అయితే 2023లో కూడా సూర్యాతో పాటు మరో ముగ్గురు పోటీ పడ్డారు. అయితే ఆ ప్లేయర్లను ఐసీసీ మొదట షార్ట్ లిస్ట్ చేసింది. అందులో మార్క్ చాప్మన్ (న్యూజిలాండ్), సికందర్ రజా (జింబాబ్వే), అల్పేష్ రమ్జాని (ఉగాండా) ఉన్నారు. వీరిని దాటుకుని సూర్య అవార్డు అందుకున్నాడు.
ప్రస్తుతం సూర్యా జర్మనీలో హెర్నియాకు ఆపరేషన్ చేయించుకున్నాడు. మరో రెండు నెలలు రెస్ట్ తప్పనిసరి అని చెబుతున్నారు. తను పూర్తిగా ఫిట్ గా మారి, వస్తే ఐపీఎల్ కి వస్తాడు లేదంటే ఏకంగా టీ 20 ప్రపంచకప్ కే వస్తాడని సీనియర్లు చెబుతున్నారు.
సూర్యాతో పాటు మరో ముగ్గురు కూడా అద్భుతంగా ఆడారు. కివీస్ బ్యాటర్ మార్క్ చాప్మన్ 19 ఇన్నింగ్స్ల్లో 576 పరుగులు సాధించాడు. జింబాబ్వే ఆల్రౌండర్ సికందర్ రజా 11 ఇన్నింగ్స్ల్లో 515 పరుగులతో పాటు 17 వికెట్లు తీశాడు. ఉగాండా బౌలర్ అల్పేష్ 55 వికెట్లు తీశాడు మొత్తంగా వీళ్లందరికన్నా మెరుగైన ఆటతీరుని కనబరిచిన సూర్యనే ఐసీసీ మరోసారి మెచ్చింది.అవార్డు ఇచ్చింది.