BCCI Awards : హైదరాబాద్లో బీసీసీఐ అవార్డుల వేడుక శోభాయమానంగా జరిగింది. జనవరి 25 నుంచి ఇంగ్లాండ్ తో ప్రారంభమయ్యే తొలి టెస్ట్ కు విచ్చేసిన టీమ్ ఇండియా ప్లేయర్లతో ఫంక్షన్ గ్రాండ్ గా జరిగింది. వీరే కాదు సీనియర్ క్రికెటర్లు సునీల్ గవాస్కర్ నుంచి బీసీసీఐ పెద్దలు, దేశవాళీ క్రికెటర్లు ఈ వేడుకకు హాజరయ్యారు. తొలి టెస్ట్ కు గాయం కారణంగా ఎంపిక కాని మహ్మద్ షమీలాంటి ఆటగాళ్లు సైతం అవార్డు తీసుకునేందుకు రావడంతో వేదిక పాత కొత్త ఆటగాళ్లతో కళకళలాడింది.
నాలుగేళ్ల తర్వాత నిర్వహించిన బీసీసీఐ వార్షిక అవార్డుల కార్యక్రమానికి హర్షా భోగ్లే వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి జైషా చేతుల మీదుగా ప్లేయర్లు అవార్డును అందుకున్నారు. నమన్ అవార్డ్స్ పేరిట నిర్వహించిన ఈవెంట్లో 2019-20 క్యాలెండర్ నుంచి, 2022-23 వరకు వరుసగా నాలుగేళ్లు బీసీసీఐ అవార్డులను ప్రకటించి, అవార్డు గ్రహీతలను సత్కరించింది.
పాలీ ఉమ్రిగర్ ఉత్తమ క్రికెటర్ అవార్డును అశ్విన్, బుమ్రా, సచిన్ వీరు ముగ్గురూ రెండేసి సార్లు అందుకున్నారు. గిల్, షమీ, సెహ్వాగ్, గంభీర్, ద్రవిడ్, భువనేశ్వర్ వీరందరూ ఒకొక్కసారి అవార్డు అందుకున్నారు. వీరందరికన్నా టాప్ లో ఉన్నది విరాట్ కొహ్లీ మాత్రమే. తను ఐదుసార్లు ఈ ఉత్తమ క్రికెటర్ అవార్డు అందుకున్నాడు. దీంతో కొహ్లీ అభిమానులు నెట్టింట ఇక్కడ కూడా తమ హీరోయే నెంబర్ వన్ అని, తనందుకే కింగ్ కొహ్లీ అని కొనియాడుతున్నారు.
నిజానికి ఈసారి శుభ్ మన్ గిల్ కి 2022-23 సంవత్సరానికి ఉత్తమ క్రికెటర్ గా ఎంపికయ్యాడు. కాకపోతే విరాట్ కొహ్లీ కూడా చాలా దగ్గరకు వచ్చాడు. 2023 వన్డే వరల్డ్ కప్ లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా తనకే వచ్చింది. అందువల్ల కొహ్లీకే మళ్లీ అవార్డు వస్తుందని అనుకున్నారు.
కానీ బీసీసీఐ మాత్రం అత్యంత వేగంగా 2వేల పరుగులు పూర్తి చేసినందుకు గిల్ కి ఓటు వేసింది. అలా జస్ట్ మిస్ అయ్యాడు. లేకుండే ఈసారి కూడా గెలిచి ఆరుసార్లు అవార్డు అందుకుని డబుల్ హ్యాట్రిక్ కొట్టేవాడని అభిమానులు వ్యాక్యానిస్తున్నారు.