ఏపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల(YS Sharmila) దూకుడుగా ముందుకెళుతున్నారు. ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్న ఆమె.. వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. తన అన్న ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(CM Jagan Mohan Reddy)ని సూటిగా ప్రశ్నిస్తూ రాష్ట్రంలో పొలిటికల్ హీట్ ను పెంచుతున్నారు.
తాజాగా విశాఖపట్నంలో కాంగ్రెస్ కార్యకర్తలతో షర్మిల సమావేశమయ్యారు. రాష్ట్రంలో కుమ్మక్కు రాజకీయాలు నడుస్తున్నాయని విమర్శించారు. పాలక పక్షం, ప్రతిపక్షం బీజేపీతో ములాఖత్ అయ్యాయన్నారు. కాషాయ పార్టీతో వైసీపీకి కంటికి కనిపించని పొత్తు ఉందని స్పష్టం చేశారు. ప్రతిపక్ష నేతగా ఉన్నసమయంలో ప్రత్యేక హోదాపై జగన్ గట్టిగా మాట్లాడిన విషయాన్ని గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రత్యేక హోదాపై పోరాటమే చేయలేదన్నారు. గంగవరం పోర్టులో రాష్ట్ర వాటాను అప్పనంగా ఇచ్చేశారని ఆరోపించారు. విశాఖ ఉక్కు కార్మాగారానికి తూట్లు పొడుస్తున్నారని మండిపడ్డారు. స్వలాభాల కోసం ప్రజాప్రయోజనాలను తాకట్టు పెట్టారని విమర్శించారు.