ఆడపిల్ల పుడితే ఇంటికి మహాలక్ష్మి వచ్చిందంటారు. చిన్నారి కాళ్లకు పట్టీలు ధరించి ఇల్లంతా కలియదిరుగుతుంటే ఘల్లు ఘల్లుమంటూ వచ్చే శబ్దానికి తెగ సంబురపడుతుంటారు. మన దేశంలోనైతే.. ఆడపిల్లలను ఏకంగా దేవీ రూపంగా కొలుస్తారు. దసరా వేడుకల్లో బాలికలను అమ్మవారి రూపంగా భావించి, కాళ్లు కడిగి, పూజ చేయటం తెలిసిందే.
అయితే.. మరి అలాంటి ఆడపిల్ల ఎవరి ఇంట్లో పుడుతుంది? అనే ప్రశ్నకు సాక్షాత్తూ శ్రీకృష్ణుడే సమాధానమిచ్చాడు. కురుక్షేత్ర యుద్ధం సమయంలో ఎటువంటి పుణ్యకార్యాలు చేస్తే ఆడపిల్లలు పుడతారు అని అర్జునుడు.. శ్రీకృష్ణుని అడుగుతాడు. అప్పుడు.. శ్రీకృష్ణుడు ‘ఎవరికైతే అదృష్టం ఉంటుందో, పూర్వజన్మలో ఎవరైతే పుణ్యకార్యాలు చేస్తారో అలాంటి వారి ఇంట్లో మాత్రమే ఆడపిల్లలు పుడతారు’ అని చెబుతాడు.
అలాగే..ఒకసారి స్వామి వివేకానంద వైష్ణో దేవి ఆలయానికి మెట్లెక్కి పోతున్నాడట. ఆ సమయంలో ఓ రైతు.. తన చిన్నారి కూతురుని భుజం మీద మోస్తూ మెట్లెక్కటాన్ని చూశాడు. ‘అంత కష్టపడుతూ మెట్లు ఎక్కటం కంటే.. ఆ పాపను దించి నడవమనొచ్చుగా’ అని వివేకానందుడు ఆ రైతును అడిగాడట. దానికి ఆయన ‘ఈ దేశంలో కూతురు ఎప్పుడూ తండ్రికి భారం కాదు. నేను ఒక్కడినీ మెట్లెక్కటం కంటే నా కూతురును మోస్తూ ఎక్కితేనే నేను తేలికగా గుడికి చేరుకుంటాను’ అన్నాడట. ఆ మాటను స్వామీ వివేకానంద అనేక సందర్భాల్లో ఉదహరించాడు.
మగ పిల్లల్ని వంశోద్ధారకుడు అంటారు కానీ నిజానికి వంశాన్ని ముందుకు నడిపించేది మాతృమూర్తి మాత్రమే అనేది అందరూ తెలుసుకోవాల్సిన సత్యం. ఎందుకంటే.. పురుషుడు ఒక కుటుంబానికి మాత్రమే పరిమితమైతే, ఆడపిల్ల రెండు కుటుంబాలకు జీవనజ్యోతిగా మారుతుంది. ఓవైపు పుట్టింటి బాధ్యతలు చూసుకుంటూ, మెట్టినింటిలో అత్తమామల బాగోగులు కూడా చూసుకుంటుంది.
అయితే.. గత దశాబ్దకాలంలో వచ్చిన సామాజిక, సాంస్కృతిక మార్పుల కారణంగా మనదేశంలో ఇటీవలి కాలంలో బాలికల పట్ల సమాజంలో గణనీయమైన మార్పు వచ్చింది. కుటుంబ పరంగానూ ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. దీనికి ప్రతీకగా చాలామంది తల్లిదండ్రులు.. తమ అమ్మాయిలను.. కొడుకుల మాదిరిగానే ఉన్నత చదువులు చదివిస్తున్నారు. దీనికి రుజువుగా ఎందరో అమ్మాయిలు తమతమ రంగాల్లో సత్తాచాటి రాణిస్తున్నారు.