National Girl Child Day : ఆడపిల్ల పుట్టిందనగానే ముఖం చిట్లించే వాతావరణం నేటికీ గ్రామాల్లో ఉంది. కానీ.. దీనికి భిన్నంగా తమ గ్రామంలో ఆడపిల్ల పుడితే పండగ చేసుకునే గ్రామాలూ అనేకం మన దేశంలో ఉన్నాయి. వాటి వివరాలు..
ఈ విషయంలో ముందుగా చెప్పాల్సిన ఓ పల్లెటూరు మన తెలంగాణలోనే ఉంది. ఆ ఊళ్లో ఆడపిల్ల పుడితే అందరూ వేడుకలా జరుపుకుంటారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలోని హరిదాస్పూర్, శివన్నగూడెం గ్రామాల్లో ఆడపిల్ల పుడితే గ్రామస్తులంతా సంబురాలు చేసుకుంటారు. తమ గ్రామంలో ఆడపిల్లలు తగ్గిపోతున్నారని గుర్తించిన గ్రామస్తులు.. ఆడపిల్లను కన్న దంపతులకు సన్మానం చేయటమే గాక.. ఆడపిల్ల పేరు మీద గ్రామ పంచాయితీ పాలక వర్గం చొరవ తీసుకుని, సుకన్య సమృద్ధి యోజన పథకం కింద ఆ శిశువుకు రూ.1000 చొప్పున తొలి ఐదు నెలల మొత్తాన్ని వారి ఖాతాలో జమచేస్తుంది. ఈ పల్లెల్లో మొత్తం 816మంది ఉండే ఈ ఊరిలో ఇప్పటికి ఈ కన్యావందనం పేరు మీద 60 మంది బాలికలకు డిపాజిట్లు చేశారు. ప్రస్తుతం గతంలో కంటే ఏటా 15 మంది బాలికలు పుడుతున్నారు.
హరిదాస్ పూర్ స్ఫూర్తితో తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని గ్రామాలు ఇదే బాట పడుతున్నాయి. వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని మరియపురం గ్రామంలో గ్రామ సర్పంచ్.. ఇప్పుడు ఈ రూ. 10 వేల రూపాయల కానుక కార్యక్రమం ప్రకటించారు. స్థానిక నిర్మల ఛారిటబుల్ ట్రస్ట్ కూడా తన వంతు సాయం అందించి బాలిక పేరు మీద వారం రోజుల్లోనే సుకన్య సమృద్ధి యోజన ఖాతా తెరిచి.. రూ. 10 వేలు డిపాజిట్ చేస్తున్నారు. ఈ బాటలోనే తమ గ్రామంలో ఆడపిల్ల పుడితే రూ.5 వేల పోస్టల్ పాలసీ చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు కరీంనగర్ రూరల్ మండలంలోని మొగ్దుంపూర్ సర్పంచ్ జక్కం నర్సయ్య.
ఏపిలోని రాజధాని అమరావతికి ఆనుకుని ఉన్న ఇందిరా నగర్ వాసులు.. 2024 కొత్త సంవత్సరం సందర్భంగా ఓ కొత్త నిర్ణయం తీసుకున్నారు. స్థానిక నేత మునగపాటి వెంకటేశ్వరావు చొరవతో వారంతా.. ఇకపై 300 ఇళ్లున్న తమ కాలనీలో ఎవరికి ఆడపిల్ల పుట్టినా.. తలా రూ. 350 చందా వసూలు చేసి, రూ. లక్ష జమ చేసి ఆ ఆడపిల్ల పేరుమీద 21 సంవత్సరాలకు డిపాజిట్ చేస్తున్నారు.
రాజస్థాన్లోని రాజ్యమండ్ జిల్లాలో పిప్లాంత్రి అనే గ్రామంలో ఆడపిల్ల పుట్టిందంటే గ్రామంలోని వారంతా సమీపంలోని అడవిలో ఆ బాలిక పేరుతో 111మొక్కలు నాటి వాటి సంరక్షణా బాధ్యతలూ తీసుకుంటారు. అంతేకాదు.. ఆ బిడ్డ కోసం తమ వాటాగా రూ.21000 ఇస్తారు. అమ్మాయి తండ్రి వాటాగా 10వేలు మొత్తం కలిపి.. రూ. 31,000 ఆ బాలిక పేరిట 20 సంవత్సరాలకు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు. ఆ బాలికకు 20 ఏళ్ల వరకు పెండ్లిచేయమనీ, ఎంతవరకు చదువితే అంతవరకు చదివిస్తామని తల్లిదండ్రులతో ప్రమాణం చేయిస్తారు. ఇలా ఆ గ్రామస్తులు ఇప్పటివరకు 3 లక్షల మొక్కలు నాటారు.
జాతీయ కుటుంబ సర్వే ప్రకారం దేశంలోని 79 శాతం మహిళలు (15-49 ఏళ్లవారు) 78 శాతం పురుషులు (15-54వయసువారు) తమకు ఒక్క ఆడపిల్ల అయినా ఉంటే బాగుండని కోరుకుంటున్నారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీలు, ముస్లింలు, గ్రామీణల్లో ఈ మార్పు కన్పించిందని సర్వే తెలిపింది. నగర, పట్ణణ ప్రాంతాల్లో 75 శాతం మహిళలు ఆడపిల్ల కావాలని కోరుకుంటుంటే, గ్రామాల్లో 81 శాతం మహిళలు తమ ఇంట్లో ఒక మహిళ ఉంటే బాగుంటుందని ఆశిస్తున్నారు.