Prudhvi PR Diary : టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేశ్ బాబు దగ్గర ఎర్ర డైరీ ఉన్నట్లుగానే తన వద్ద కూడా ఓ పీఆర్ డైరీ ఉందని సినీ నటుడు పృథ్వీ ఆసక్తికర వాఖ్యలు చెశారు. వైసీపీ నేతల జాతకం ఏంటనేది పృథ్వీ రాజ్ డైరీలో చిట్టా విప్పుతానని తెలిపారు. ఏపీలో టీడీపీ, జనసేన రెండు జెండాల కలయిక అద్భుతమన్నారు. ఇది మార్పుకు శుభసూచికమని తెలిపారు. అలాగే ఏపీలో 130 స్థానాలతో టీడీపీ – జనసేన కూటమి అధికారంలోకి వస్తుందని అంటున్నారు.
పీఆర్ డైరీలో తనకు సంబంధించినవన్నీ రాశానని చెప్పుకొచ్చారు పృథ్విరాజ్. పార్టీ ప్రచారాలకు వెళ్లి.. సుమారు రూ.90 నుంచి 95 లక్షల వరకూ నష్టపోయానన్నారు. తనను మోసం చేసిందెవరో, దుర్మార్గులెవరో, లేనిపోనివిధంగా దుర్భాషలాడిందెవరో, ప్రజల్ని ఏ రకంగా మోసం చేస్తున్నారు ? గెలిచినపుడు అభ్యర్థుల ఆస్తులెంత? ఇప్పుడెంత ఆస్తులున్నాయి? అనే విషయాలన్నింటిపై తానొక డైరీ రాసుకున్నానని తెలిపారు. ఒక్కొక్కరోజు.. ఒక్కొక్క నియోజకవర్గంలో ప్రచారం చేసేటపుడు, డైరీలోని విషయాలను ఒక్కొక్కటిగా బయటపెడతానని నటుడు పృథ్విరాజ్ తెలిపారు. శ్రీకాళహస్తి నుంచి శ్రీకాకుళం వరకూ.. అందరి జాతకాలు తన డైరీలో ఉన్నాయన్నారు.
రాష్ట్ర అభివృద్ధికి, సంక్షేమానికి నాంది అయిన.. తెలుగుదేశం – జనసేనలతో కలిసే తాను నడుస్తానని అన్నారు. ఆ రెండు పార్టీలు వదిలిన బాణమే తాను అని, తనను పోటీచేయమని చెబితే చేస్తా.. లేదంటే పార్టీల వెంటే తన ప్రయాణం ఉంటుందని ఈ సందర్భంగా పృథ్విరాజ్ స్పష్టం చేశారు. త్వరలోనే జనసేన పార్టీలో అధికారికంగా పార్టీ కండువా కప్పుకుని చేరుతానని తెలిపారు.
.
.