Medak BRS MLA’s update(Political news in telangana):
నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలవడం హాట్ టాపిక్ గా మారింది. ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే కె.మాణిక్ రావు మంగళవారం సీఎంతో భేటీ అయ్యారు. అప్పటినుంచి ఆ ఎమ్మెల్యేలు కారు దిగిపోతారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
దీంతో ఈ వార్తలపై ఆ నలుగురు ఎమ్మెల్యేలు స్పందించారు. తాము పార్టీ మారుతున్నామని జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. నియోజకవర్గ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడానికే సీఎంఓకి వెళ్లామని వెల్లడించారు. కానీ ఎవరికి నచ్చినట్టు వాళ్లు ప్రచారం చేస్తున్నారని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తామని నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. తాము ఎవరితోనూ చర్చలు జరపలేదని సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. మెదక్ జిల్లా సమస్యలు వివరించేందుకే సీఎంను కలిశామన్నారు. కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తమ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తే పరువునష్టం దావా వేస్తామని వార్నింగ్ ఇచ్చారు. నియోజకవర్గాల సమస్యలు, అభివృద్ధి అంశాలను ముఖ్యమంత్రికి చెప్పడం తమ హక్కు అని తెలిపారు. మెదక్ జిల్లాకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరామన్నారు.
సీఎం రేవంత్ రెడ్డికి మెదక్ జిల్లా సమస్యల గురించి చెప్పామని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తెలిపారు. అంతకుముందు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి సమస్యలు పరిష్కరించాలని కోరిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి బీఆర్ఎస్ లోనే ఉన్నామని.. ఇప్పుడు కాంగ్రెస్లో ఎందుకు చేరుతామని ప్రశ్నించారు. మెదక్ జిల్లాలో ప్రొటోకాల్ పాటించడం లేదని సీఎంకు ఫిర్యాదు చేశామన్నారు.