Jambukeswaram Temple : మనదేశంలో అద్భుతమైన శిల్పకళతో అలరారే భారీ, అతి ప్రాచీన ఆలయాల్లో తమిళనాడులోని జంబుకేశ్వరాలయం ఒకటి. సుమారు 1800 ఏళ్ళ చరిత్ర గల ఈ ఆలయాన్ని చోళ రాజవంశానికి చెందిన రాజు కోకెంగనన్ నిర్మించాడు. ఇది తిరుచ్చి పట్టణానికి 11 కి.మీ దూరంలో ఉంది. పంచభూతాలకు ప్రతీకలుగా నిలిచిన అయిదు శివలింగాల్లో ఒకటైన జలలింగం రూపంలో పరమశివుడు దర్శనమిచ్చే క్షేత్రమిది.
ఇక్కడి స్థల పురాణం ప్రకారం శంభుడు అనే శివభక్తుడైన ముని.. రోజూ శివుని పూజించేవాడు. శివపూజ కానిదే పచ్చి గంగనైనా ముట్టేవాడు కాదు. ఆ ముని.. తాను నేరుగా శివునికి అర్చన చేయాలనే కోరికతో శివుని గురించి తపస్సు చేయగా, శివయ్య.. ప్రత్యక్షమై ఏం వరం కావాలని అడగగా, ‘నిన్ను నేరుగా పూజించే అవకాశం ఇవ్వు’ అని అడగగా, శివుడు సరేనన్నాడు. ఆ మాట మేరకు పరమేశ్వరుడు జల లింగంగా మారగా, ఆయన భక్తుడైన శంభుడు.. ఈ పక్కనే నేరేడు చెట్టు(జంబూ వృక్షం)గా మారి నాటి నుంచి స్వామిని సేవిస్తూనే ఉన్నాడు. జంబూ అంటే తెల్లనేరేడు. దీనికి రుజువుగా నేటికీ ఆలయ ప్రాంగణంలో అనేక తెల్ల నేరేడు చెట్లు కనిపిస్తాయి.
మరో కథనం ప్రకారం.. తనను చూసి అకారణంగా నవ్విన పార్వతీ దేవి తీరుకు నొచ్చుకున్న శివుడు.. ఆమెను భూలోకంలో తపస్సు చేయమని ఆదేశించగా, ఆమె అఖిలాండేశ్వరిగా జంబూ వనానికి చేరుకుని, చెట్టు కింద శివలింగాన్ని తయారు చేసి పూజించిందని, ఆమె భక్తిని మెచ్చుకుని శివుడు తానూ ఆమెకు ఎదురుగా వచ్చి జలలింగంగా నిలిచిపోయాడని చెబుతారు. దీనికి రుజువుగా ఈ ఆలయంలో శివలింగానికి ఎదురుగా అమ్మవారి విగ్రహం ఉంటుంది.
ఇక్కడి శివలింగం జలలింగం గనుక.. దాని పానపట్టం నుండి ఎపుడూ నీరు ఊరుతూ ఉంటుంది. శివలింగపు పానపట్టంపై అర్చకులు ఒక వస్త్రాన్ని కప్పి, కాసేపటికి తీసి పిండితే నీళ్లు వస్తుంటాయి. అందుకే తమిళులు ఈ స్వామిని నీర్ తిరళ్నాథర్ అని పిలుస్తారు.
ఇక్కడ.. అమ్మవారు అఖిలాండేశ్వరి పేరుతో 4 భుజాలతో నిలబడి దర్శనమిస్తుంది. పై రెండు చేతుల్లో పద్మాలతో, దిగువ రెండు హస్తాల్లో అభయ, వరద ముద్ర దర్శనమిస్తాయి. అఖిలాండేశ్వరి ఒకప్పుడు ఉగ్ర రూపిణిగా ఉండేవారనీ, ఆది శంకరుల కోరికపై అమ్మవారు శాంతమూర్తిగా మార్చారని చెబుతారు. అమ్మవారి ముందున్న శ్రీ చక్రాన్ని శంకరులే స్వయంగా ప్రతిష్ఠించారని, అమ్మవారి చెవి కుండలాలను కూడా ఆయనే సమర్పించారని కథనం.
గర్భగుడిలో గవాక్షానికి నవద్వార గవాక్షం అని పేరు. ఇక్కడి దేవాలయం విశాలమైన ప్రాకారాలతో ఎత్తైన గోపురాలతో భక్తులను ఆకట్టుకుంటుంది. ఇక ఆలయంలోని ఉపాలయాలు, మండపాల్లోని శిల్పసంపద చూపరులను అబ్బురపరుస్తుంది. ఈ ఆలయ ప్రాంగణంలో వివాహాలు జరగవు. ఇక్కడి పూజారులు స్త్రీల వస్త్రాలు ధరించి జంబుకేశ్వరుడిని పూజిస్తారు.
ఈ ఆలయంలోని ఒక ప్రాకారాన్ని వృద్ధుని రూపంలో వచ్చిన శివుడు స్వయంగా నిర్మించాడని, ఆ పనిలో భాగస్వాములైన వారంతా సాక్షాత్తూ శివగణాలనేనని చెబుతారు. ఈ ప్రాకార నిర్మాణంలో పనివారికి రోజూ ఆ వృద్ధుడు కొద్దిగా విభూతిని ఇచ్చేవాడనీ, ఇంటికి వెళ్ళగానే అది బంగారంగా మారేదనే కథ ఉంది.