BCCI Awards 2024 : హైదరాబాద్ లో బీసీసీఐ అవార్డుల వేడుక ఘనంగా జరిగింది. నమన్ అవార్డ్స్ పేరిట బీసీసీఐ ఇచ్చే వార్షిక పురస్కారల ప్రదానోత్సవంలో పలువురు టీమిండియా మాజీ, ప్రస్తుత క్రికెటర్లు పాల్గొన్నారు. భారత మాజీ ఆల్రౌండర్, మాజీ కోచ్ రవిశాస్త్రి.. కర్నల్ సీకే నాయుడు జీవితకాల సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు.
2022-23 సంవత్సరానికి పాలీ ఉమ్రిగర్ ఉత్తమ క్రికెటర్గా యంగ్ బ్యాటర్ శుభ్మన్ గిల్ నిలిచాడు. కరోనా కారణంగా మూడేళ్లుగా ఈ అవార్డుల ప్రదానోత్సవం ఆగిపోయింది. అందుకని మిగిలిన ఆ మూడేళ్లకు కూడా బీసీసీఐ అన్ని విభాగాల్లో అవార్డులను ప్రకటించింది.
అలా 2021-22 సంవత్సరానికి పాలీ ఉమ్రిగర్ అవార్డును జస్ప్రీత్ బుమ్రా, 2020-21 సంవత్సరానికి రవిచంద్రన్ అశ్విన్ , 2019-20 సంవత్సరానికి మహమ్మద్ షమీలు అందుకున్నారు. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, సెక్రటరీ జై షాలు రవిశాస్త్రికి అవార్డును బహుకరించారు.
2022-2023 సంవత్సరానికి గానూ.. టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా యశస్వి జైశ్వాల్.. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా రవిచంద్రన్ అశ్విన్లు అవార్డును అందుకున్నారు.
బెస్ట్ ఇంటర్నేషనల్ డెబ్యూట్ మెన్స్ క్రికెట్ లో 2019-20 సంవత్సరానికి మయాంక్ అగర్వాల్ అందుకున్నాడు. 2020-21 ఏడాదికి అక్షర్ పటేల్ తీసుకుంటే, 2021-22 ఏడాదికి శ్రేయాస్ అయ్యర్ కి దక్కింది. 2022-23లో యశస్వి జైస్వాల్ అందుకున్నాడు.
దేశవాళీ క్రికెట్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లకు సైతం బీసీసీఐ అవార్డులు ప్రకటించింది. దేశవాళీ టోర్నమెంట్లలో ఉత్తమ జట్టుగా వరుసగా సౌరాష్ట్ర (2022-23), మధ్యప్రదేశ్ (2021-22) ముంబయి (2019-20) లు నిలిచాయి.
మహిళల క్రికెట్ లో కూడా బీసీసీఐ అవార్డులను ప్రకటించింది. అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్లుగా.. 2022-23 సంవత్సరానికి దేవికా యాదవ్ అందుకుంటే, 2021-22 ఏడాదికి రాజేశ్వరి గైక్వాడ్ అందుకుంది. 2020-21 ఏడాదికి జులన్ గోస్వామి, 2019-20 సంవత్సరానికి పూనమ్ యాదవ్ అందుకున్నారు.
వరుసగా రెండేళ్లు 2020-21, 2021-22 సంవత్సరానికి ఉత్తమ మహిళా క్రికెటర్గా స్మృతి మంథాన ఎంపికైంది. మరో రెండేళ్లు 2019-20, 2022-23 సంవత్సరాలకు దీప్తి శర్మ ఎంపికైంది.