Oscars 2024: సినీ ప్రపంచమంతా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఆస్కార్ అవార్డుల వేడుకకు రంగం సిద్ధమైంది. మంగళవారం రాత్రి 96వ అకాడెమీ అవార్డుల నామినేషన్లను ప్రకటించారు. యూఎస్ కాలిఫోర్నియాలోని శామ్యూల్ గోల్డ్విన్ థియేటర్ ఈ నామినేషన్ల ప్రకటనకు వేదికగా మారింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ విదేశీ చిత్రం, ఉత్తమ దర్శకుడు.. ఇలా మొత్తం ఇరవై మూడు విభాగాల్లో 120కి పైగా సినిమాలు, డాక్యుమెంటరీలకు నామినేషన్లు వెల్లడించారు. ఇందులో ‘ఓపెన్హైమర్’, ‘ది పూర్ థింగ్స్’, ‘కిల్లర్స్ ఆఫ్ది ఫ్లవర్మూన్’, ‘బార్బీ’ వంటి చిత్రాలు అత్యధిక నామినేషన్లు సొంతం చేసుకున్నాయి.
మార్చి 10(భారత కాలమానం ప్రకారం మార్చి 11)న ఆస్కార్ తుది విజేతలెవరో తేలిపోనుంది. వరుసగా నాలుగోసారి జిమ్మీ కిమ్మెల్ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. ఇదిలా ఉండగా.. ఈ సారి ఈ ఆస్కార్ బరిలో డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో భారతీయ కథ ‘టు కిల్ ఏ టైగర్’ ఆస్కార్కి పోటీ పడుతోంది. ఢిల్లీలో పుట్టి, కెనడాలో స్థిరపడ్డ నిషా పహూజా దీన్ని తెరకెక్కించారు. కాగా ఈ చిత్రం ఇప్పటికే ప్రతిష్ఠాత్మక టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో విజేతగా నిలిచింది. ఈ అవార్డు కోసం మరో నాలుగు డాక్యుమెంటరీలతో ‘టు కిల్ ఏ టైగర్’ పోటీ పడుతోంది.