Medak BRS MLA’s : ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్రెడ్డిని కలవడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. మంగళవారం నాడు ముఖ్యమంత్రి నివాసంలో ఎమ్మెల్యేలు సీఎంతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి , కొత్తప్రభాకర్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, మాణిక్రావు ఈ సమావేశంలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ శాసనసభ్యులు సీఎంను కలవడంతో సర్వత్రా చర్చకు దారితీసింది.
ఈ భేటీకి సంబంధించి కొత్త ప్రభాకర్ అపాయింట్మెంట్ తీసుకోగా.. మెదక్ జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు కలిసి వెళ్లి ముఖ్యమంత్రిని కలిశారు. అయితే తాము మర్యాద పూర్వకంగానే కలిసినట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి వద్ద గన్మెన్ల అంశాన్ని కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రస్తావించినట్లు తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం గత సర్కారు హయాంలో నిర్మించిన ప్రాజెక్టులపై విచారణ జరుపుతోంది. అక్రమాలు తేలితే బీఆర్ఎస్ బడా నేతలు జైలుకే అంటూ మంత్రులు, కాంగ్రెస్ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలో వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేేరేందుకు సిద్ధంగా ఉన్నారంటూ కాంగ్రెస్ మంత్రులు గత కొద్ది రోజులుగా చెబుతూ వస్తున్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత సుమారు 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రీసెంట్ గానే వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేలు భేటీ కావడం గులాబీ నేతల్లో గుబులు పుట్టిస్తుంది.
.
.