Ganta Resign Politics : టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా ఆమోదంతో ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఎప్పుడో మూడేళ్ల కిందట చేసిన రాజీనామాను అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఇప్పుడు ఆమోదం తెలపడంతో పొలిటికల్ హీట్ మరింత రాజుకుంది. దీని వెనుక వైసీపీ రాజ్యసభ ఎన్నికల వ్యూహం ఉందని జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతోపాటు పార్టీ ఫిరాంపు నేతలకు నోటీసులు ఇవ్వడం కూడా రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.
రాజ్యసభ ఎన్నికల వేళ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను ఆమోదించి టీడీపీకి షాక్ ఇచ్చారు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం. విశాఖస్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడిన గంటా.. గత మూడేళ్ల క్రితం తన పదవికి రాజీనామా చేశారు. అయితే స్పీకర్ ఫార్మెట్లో గంటా రాజీనామా చేయలేదని విమర్శలు గుప్పించారు అధికార పార్టీ నేతలు. దీంతో గంటా 2021 ఫిబ్రవరి 12న స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని కూడా స్పీకర్ను కోరారు. ఇదంతా జరిగి మూడేళ్ల అవుతుంది. అయితే.. ఇన్నాళ్లు పెండింగ్లో పెట్టి సరిగ్గా రాజ్యసభ ఎన్నికలకు నెల రోజులు ముందు ఆమోదించారు తమ్మినేని. ఈ మేరకు ఏపీ అసెంబ్లీ కార్యదర్శి నోటిఫికేషన్ జారీ చేశారు. రాజ్యసభ ఎన్నికల కోసమే వైసీపీ ఎత్తుగడ వేసిందని మండిపడుతున్నారు.
గంటా రాజీనామా ఆమోదంతో మరోసారి వైసీపీ టీడీపీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మూడేళ్ల క్రితం రాజీనామా చేస్తే ఎన్నికల ముందు ఆమోదిస్తారా అని మండిపడుతున్నారు గంటా శ్రీనివాసరావు. జగన్కు వ్యతిరేకంగా ఓటు వేస్తారన్న భయం పట్టుకుంది కాబట్టే తనను సంప్రదించకుండా మూడేళ్లనాటి రీజైన్ను ఇప్పుడు ఆమోదించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ దివాళా కోరు రాజకీయం చేస్తోందని నిప్పులు చెరిగారు. రాజ్యసభ ఎన్నికల్లో తన ఓటు వినియోగించుకోవడానికి ప్రయత్నిస్తానని ప్రకటించారు.
మరోపక్క 8 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు జారీ చేశారు అసెంబ్లీ స్పీకర్. వైసీపీ నుంచి గెలిచి ఆ పార్టీకి రెబల్గా మారిన ఉండవల్లి శ్రీదేవి, ఆనం రాంనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, మేకపాటి చంద్రశేరరెడ్డితో పాటు టీడీపీ నుంచి గెలిచి వైసీపీకి అనుబంధంగా ఉన్న కరణం బలరాం, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్, మద్దాలి గిరిలకు నోటీసులు ఇచ్చారు. అలాగే జనసేన నుంచి గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్కు కూడా నోటీసులు జారీ చేశారు. వారంలోగా సంజాయిషీ ఇవ్వాలని లేదంటే అనర్హత వేటు తప్పదని నోటీస్ ద్వారా వార్నింగ్ ఇచ్చారు.
ఎమ్మెల్యేకోటా నుంచి రాజ్యసభకు ఎన్నికైన వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, సీఎం రమేష్, కనకమేడల రవీంద్రకుమార్ల పదవీకాలం ఈ ఏడాది ఏప్రిల్ 2తో ముగియనుంది. దీంతో ఈ స్థానాలు ఖాళీ కానుండటంతో సీట్ల భర్తీకి తర్వలోనే ఎన్నికలకు జరగనున్నాయి. ఈ మేరకు మరికొద్దిరోజుల్లో నోటిఫికేషన్ కూడా విడుదలకానుంది. ఈ ఎన్నికల ఎత్తుగడలో భాగంగానే స్పీకర్ తమ్మినేని ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
.
.