Union Budget History : దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 76 ఏళ్లు. ఈ కాలంలో మన స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) 56 రెట్లు పెరిగింది. తొలి బడ్జెట్ సమర్పించినప్పుడు జీడీపీ రూ.2.7 లక్షల కోట్లు ఉండగా.. ఇప్పుడు దాదాపు రూ.150 లక్షల కోట్లకు చేరింది.
1947లో అత్యంత బలహీన ఆర్థిక వ్యవస్థలున్న ఐదు దేశాల్లో ఒకటిగా ప్రయాణం ఆరంభించిన భారత్.. 2024 నాటికి ప్రపంచపు ఐదో పెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగింది.
ఇప్పటివరకు 74 వార్షిక బడ్జెట్లు, 14 మధ్యంతర బడ్జెట్లు, 4 ప్రత్యేక బడ్జెట్లను ప్రవేశపెట్టాం. 70 రైల్వే బడ్జెట్లు వీటికి అదనం.
1947 నాటికి బ్రిటిషర్లు 23 రైల్వే బడ్జెట్లు సమర్పించారు. అప్పట్లో అన్నింటికంటే రైల్వే ఆదాయం ఎక్కువ గనుక బ్రిటిషర్లు విడిగా రైల్వే బడ్జెట్ పెట్టేవారు. 1924 నుంచి 2016 వరకు అది అలాగే కొనసాగగా, 2017లో అరుణ్ జైట్లీ ఆర్థిక మంత్రిగా ఉండగా, ఆ విధానానికి స్వస్తి పలికి, దీనిని ప్రధాన బడ్జెట్లో విలీనం చేశారు. రైల్వేకు ప్రత్యేక బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఏకైక దేశం మనదే కావటం విశేషం. 76 ఏళ్లలో 162 బడ్జెట్లను ప్రవేశపెట్టిన ఘనత మనది.
164 ఏళ్ల క్రితం తొలి బడ్జెట్
బ్రిటిష్ ఇండియాలో తొలి బడ్జెట్ను ప్రవేశపెట్టింది ఎవరో తెలుసా? స్కాట్లండ్కు చెందిన వ్యాపారవేత్త, ఆర్థికవేత్త, లిబరల్ నేత జేమ్స్ విల్సన్ 164 ఏళ్ల క్రితం దానిని సమర్పించారు. వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ తొలి ఫైనాన్స్ మెంబర్ కూడా ఆయనే. డిసెంబర్ 1859 నుంచి ఆగస్టు 1860లో మరణించేంత వరకు ఆ పదవిలో కొనసాగారు.
1857లో సిపాయిల తిరుగుబాటు నేపథ్యంలో నెలకొన్న పరిస్థితులను చక్కదిద్దేందుకు ఆయనను భారత్కు పంపారు. రెండేళ్లకు ఆర్థిక సభ్యుడి హోదాలో తొలిసారిగా 7 ఏప్రిల్ 1860లో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ది ఎకనమిస్ట్ వీక్లీ, చార్టెర్డ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆస్ట్రేలియా, చైనా వ్యవస్థాపకుడు. ఆ బ్యాంక్ 1969లో స్టాండర్డ్ బ్యాంక్ తో విలీనమై.. స్టాండర్డ్ చార్టెర్డ్గా రూపాంతరం చెందింది.
ఇక స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత తొలి బడ్జెట్ను 26 నవంబర్ 1947న నాటి ఆర్థిక మంత్రి రామస్వామి షెట్టి కందస్వామి షణ్ముగం షెట్టి (ఆర్కే షణ్ముగం షెట్టి) సమర్పించారు. గణతంత్ర భారత్లో తొలి బడ్జెట్ సమర్పించే అవకాశం జాన్ మతాయ్కి దక్కింది. ఫిబ్రవరి 28, 1950న ఆయన లోక్సభలో బడ్జెట్ను ప్రవేశపెట్టారు.
బడ్జెట్ ఆలోచన ఆయనదే..
కేంద్ర బడ్జెట్ రూపకల్పన ఆలోచనల వెనుక ప్రొఫెసర్ ప్రశాంత చంద్ర మహలనోబిస్ ఉన్నారు. ఆయన శాస్త్రవేత్త, ప్రముఖ స్టాటిస్టీషియన్. తొలి ప్లానింగ్ కమిషన్ సభ్యుల్లో కీలక వ్యక్తి. భారత్లో ఆధునిక గణాంక శాస్త్ర రంగ పితామహుడిగా పేరొందారు. ఇండియన్ స్టాటిస్టికల్ ఇనిస్టిట్యూషన్ను స్థాపించింది ఆయనే. స్వతంత్ర భారత బడ్జెట్ రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు.